కలిసి కాపురం చేస్తున్న తోడల్లుళ్లు...కోర్టుకెక్కిన అక్కాచెల్లెళ్లు

సోమవారం, 17 అక్టోబరు 2016 (14:27 IST)
పిచ్చి పలు రకాలు … వెర్రి వేయి రకాలు అనే సామెత అందరికి గుర్తుండే ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. ఇలాంటి అరుదైన ఘటనలు నూటికో, కోటికో ఒకటి జరుగుతుంది. ఆ వివరాలు పరిశీలిస్తే... అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరు మగాళ్లు మనసుపడ్డారు. ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. కలిసి జీవించాలని ఆశపడ్డారు. దీనికోసం వారి భార్యలను వదిలేశారు. ఇద్దరూ కలిసి ఒకే ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. దీంతో వారి భార్యలు కోర్టుమెట్లెక్కారు. ఇక్కడ మరో విచిత్రమేంటంటే ఆ మహిళలిద్దరూ అక్కాచెల్లెళ్లూ... ఆ మగాళ్లిద్దరూ తోడల్లుళ్లు. 
 
2010లో ఆ కుటుంబంలోని పెద్దమ్మాయికి వివాహం జరిగింది. 2013లో ఆమె చెల్లికి పెళ్లయింది. ఇద్దరు తోడల్లుళ్లు సన్నిహితంగా ఉండటం చూసి అల్లుళ్లు ఇద్దరూ కలుపుగోలుతనంతో ఉన్నారనుకుని కుటుంబసభ్యులంతా అనుకున్నారు. కానీ విడదీయలేనంత దగ్గరయ్యారని మాత్రం అప్పుడు ఎవ్వరికి అర్థం కాలేదు. ఇద్దరూ కట్టుకున్న భార్యలను వదిలేసి సంవత్సరంన్నర నుంచి వేరు కాపురం పెట్టారు. ఆ అక్కాచెల్లెళ్లు భర్తల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ స్టేషన్‌లో కూడా అక్కాచెల్లెళ్లకి న్యాయం జరగలేదు. 
 
వారిద్దరిని విడిగా ఉండమని చెప్పే హక్కు చట్టప్రకారం లేదని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పడానికి మాత్రమే అవకాశం ఉందని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో వారిద్దరూ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. తమ భర్తలు హింసిస్తున్నారని, నిర్లక్ష్యం చేస్తున్నారని గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇటీవల విచారణకొచ్చింది. కోర్టు కూడా ఆ ఇద్దరు మహిళలను పోషించేందుకు అవసరమయ్యే ఖర్చులను చెల్లించాలని భర్తలను ఆదేశించింది. ఆ కేసును నవంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. మరి కోర్టు ఈ అక్కాచెల్లెళ్లకి న్యాయం చేస్తుందో లేదో వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి