టీకాల కొరతతో కేంద్రం కీలక నిర్ణయం!

మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (15:51 IST)
భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విదేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది.

దీంతో అత్యవసర వినియోగ అనుమతులను వేగంగా ఇచ్చేందుకు సన్నద్ధం అయ్యింది. భారత్‌లో ఇప్పటికే మూడు టీకాలు అనుమతులు పొందాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరికొద్ది రోజుల్లోనే మరిన్ని టీకాలు అందుబాటులోకి రానున్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 10.85 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశారు. వ్యాక్సిన్‌ కొరత ఉందని పలు రాష్ట్రాలు కేంద్రానికి విన్నవిస్తున్నాయి.

దీంతో దేశీయంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచడంతో పాటు విదేశాల్లో అనుమతి పొందిన టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతించి, కొరతను అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

తద్వారా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న టీకా ఫలితాల సమాచారాన్ని త్వరగా విశ్లేషించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇప్పటికే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాకు డీసీజీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మరికొన్ని నెలల్లోనే జాన్సన్‌ అండ్‌ జాన్సన్, జైడస్‌ క్యాడిలా, నోవావాక్స్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా తీసుకునే టీకాలు అందుబాటులోకి రానున్నాయి.

విదేశాల్లో అభివృద్ధి చేసిన టీకాలు భారత్‌లో అనుమతి పొందాలంటే ఇక్కడే రెండో, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో స్పుత్నిక్‌-వి, నోవావాక్స్‌ టీకాల ప్రయోగాలు భారత్‌లో కొనసాగుతాయి.

అందువల్ల విదేశాల్లో అనుమతులు పొందినప్పటికీ వాటిని భారత్‌లో వినియోగించేందుకు ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో వీటి ప్రయోగాలు, ఫలితాల విశ్లేషణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు