అయోధ్యపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం - కేంద్ర అలెర్ట్

వరుణ్

ఆదివారం, 21 జనవరి 2024 (09:33 IST)
సోషల్ మీడియా వేదికగా అయోధ్యపై తప్పుడు ప్రచారం సాగుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తప్పుడు లేదా మోసపూరిత సమాచారం లేకుండా చూడాలని ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు మీడియా సంస్థలకు సోషల్ మీడియా మాధ్యమాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. 
 
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం జరుగనుంది. ఈ మహా ఘట్టం కోసం కోట్లాదిమంది దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరాముడి దర్శనం, ప్రసాదం, ఫొటోలు, విగ్రహం పేరుతో కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయోధ్య రామమందిరంపై ఎలాంటి తప్పుడు లేదా మోసపూరిత సమాచారం రాకుండా చూడాలని అన్ని మీడియా సంస్థలకు, సోషల్ మీడియా మాధ్యమాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
 
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ సమయంలో ధ్రువీకరించని లేదా రెచ్చగొట్టే లేదా నకిలీ సందేశాలు వ్యాప్తి చెందుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలా ఎక్కువగా జరుగుతోందని, ఇలాంటి వ్యవహారం శాంతిభద్రతలకు, మతసామరస్యానికి విఘాతం కలిగిస్తుందని తెలిపింది. 
 
ఇలాంటి తప్పుడు, మోసపూరిత సమాచారాన్ని ప్రచురించకుండా... ప్రసారం చేయకుండా వార్తాపత్రికలు, ప్రయివేటు శాటిలైట్ టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా, కరెంట్ అఫైర్స్ పబ్లిషర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికలు సంబంధిత కంటెంట్ను కట్టడి చేయాలని ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు