ధామి పట్టణంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం

వరుణ్

ఆదివారం, 21 జనవరి 2024 (09:25 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాకు సమీపంలోని ధామి పట్టణంలో ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన సిమ్లాకు 26 కిలోమీటర్ల దూరంలో జిరగింది. భారీ వర్షాలు, వరదలకు కొండ చరియలు విరిగిపడిన సమయంలో కొండ రాళ్ళ భవనాన్ని బలంగా ఢీకొట్టాయి. దీంతో భవన్ పునాదులు కదిలిపోవడం వల్ల ఈ భవనం కుప్పకూలిపోయివుంటుందని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. పైగా, ఈ భవనంలోని ప్రజలను ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం లేకుండా పోయింది. 
 
ధామి పట్టణంలోని మరహ్వాగ్ ప్రాంతంలో రాజ్‌ కుమార్ అనే వ్యక్తికి సంబంధించి ఐదు అంతస్తుల భవనం ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. రాళ్లు ఈ భవనం గోడలను బలంగా ఢీకొట్టాయి. ఈ క్రమంలో ఇంటిని మరమ్మతు చేయించేందుకు రాజ్ కుమార్ అందరినీ ఖాళీ చేయించారు. 
 
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవనం పరిస్థితిని గమనించిన అధికారులు ముందుగానే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భవనం కూలిపోవడంతో ధామి డిగ్రీ కాలేజీకి వెళ్ళే రహదారి దెబ్బతింది. భవనం కూలిపోయే దృశ్యానికి సంబంధించిన 15 సెకన్ల వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు