వీడి శాడిజం తగలెయ్యా... చిల్లర రూపంలో భరణం డబ్బులు చెల్లింపు

బుధవారం, 25 జులై 2018 (14:45 IST)
అనేక మంది వ్యక్తులు అపుడపుడూ తమలోని శాడిజాన్ని బహిర్గతం చేస్తుంటారు. అలా భార్య నుంచి విడాకులు పొందిన ఓ మాజీ భర్త తనలోని శాడిజంను చిల్లర రూపంలో ప్రదర్శించాడు. కోర్టు ఆదేశం మేరకు మాజీ భార్యకు తాను చెల్లించాల్సిన భరణం డబ్బులను చిల్లర రూపంలో చెల్లించి తనలోని శాడిజాన్ని బయటపెట్టాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ జంట.. మూడేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. విడాకుల సమయంలో ప్రతినెలా 25 వేల రూపాయలు భరణం కింద చెల్లించాలని భర్తకు కోర్టు ఆదేశించింది. ఇంతవరకుబాగానే ఉంది. అయితే రెండు నెలలుగా భర్త ఇవ్వాల్సిన భరణం ఇవ్వటం లేదని ఆమె కోర్టు మెట్లెక్కింది. తనకు న్యాయం చేయాలని పిటిషన్ వేసింది. 
 
దీన్ని విచారణకు కోర్టు స్వీకరించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భరణం చెల్లించలేకపోయినట్టు సదరు భర్త కోర్టుకు విన్నవించుకున్నాడు. ఆ  తర్వాత ఈనెల భరణం చెల్లించేందుకు సమ్మతించాడు. ఆ వెంటనే.. ఓ పెద్ద బ్యాగ్ అందించాడు భార్యకు. జడ్జితోపాటు అందరూ షాక్ అయ్యారు. భార్య అయితే నోరెళ్లబెట్టింది. ఎందుకంటే తను ఇవ్వాల్సిన డబ్బు మొత్తాన్ని రూపాయి, 2 రూపాయల నాణేల రూపంలో ఇచ్చాడు. కేవలం రూ.400 మాత్రమే నోట్ల రూపంలో ఇచ్చాడు. 
 
అది కూడా నాలుగు 100 రూపాయల నోట్లు. మిగతా 24 వేల 600 రూపాయలు చిల్లరగా ఉన్నాయి. అన్నీ రూపాయి, 2 రూపాయల నాణేలు. కోర్టు హాలులోనే భార్య ఆవేదన వ్యక్తంచేసింది. కావాలనే ఇలా చేస్తున్నాడని.. ఇదో రకమైన వేధింపులు అంటూ చెప్పుకొచ్చింది. అతని దగ్గర డబ్బులు ఉన్నాయని.. నోట్ల రూపంలో ఇవ్వాలని జడ్జిని కోరింది.
 
దీనిపై భర్త తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించలేదని పిటీషన్ వేశారని.. డబ్బు ఇస్తే ఇలా మాట్లాడటం భావ్యం కాదంటూ వాదించారు. భరణం డబ్బులను నోట్ల రూపంలోనే ఇవ్వాలని.. చిల్లరగా ఇవ్వకూడదు అనే నిబంధన ఏదీ లేదని వాదించారు. చిల్లరగా చెల్లుబాటు అవుతుందని స్పష్టంచేశారు. దీంతో బడ్జి సైతం ఖంగుతిన్నారు. చిల్లర లెక్కింపునకు ముగ్గురు కోర్టు సిబ్బందిని నియమించారు. దీనిపై విచారణను 27వ తేదీకి వాయిదా వేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు