ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాజకీయ భవిష్యత్పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు తనకు ఫుల్టైమ్ జాబ్ కాదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారసత్వం గురించి మహారాష్ట్ర అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ జీవితంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
"నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. పార్టీ నన్ను యూపీ ప్రజల కోసం నియమించింది. అందుకే రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తున్నాను. ఇక పాలిటిక్స్ నాకు ఫుల్టైమ్ జాబ్ కాదు. వాస్తవానికి నేను ఒక యోగిని" అని స్పష్టం చేశారు. ప్రతి పనికి ఒక కాలపరిమితి ఉంటుందన్నారు. అదేవిధంగా తన రాజకీయ జీవితానికి కూడా పరిమితి ఉంటుందన్నారు.
బీజేపీ హైకమాండ్తో తనకు విభేదాలు ఉన్నాయంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనకు పార్టీ ఇచ్చిన అవకాశం వల్లే ఇక్కడ కూర్చొన్నానని చెప్పారు. పార్టీ పెద్దలతో విభేదాలు ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగేవాడినా అంటూ ప్రశ్నించారు. ఎవరో ఒకరు తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంటారని, వాటిని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు.