నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న రాహుల్ గాంధీ

సోమవారం, 20 జూన్ 2022 (08:41 IST)
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సోమవారం మరోమారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీలాండరింగ్ కేసులో ఆయన వద్ద గత వారంలో మూడు రోజుల పాటు విచారణ చేపట్టారు. ఆ తర్వాత రాహుల్ వినతి మేరకు మూడు రోజుల పాటు విశ్రాంతినిచ్చారు. సోమవారం నుంచి మళ్లీ ఈ విచారణ తిరిగి ప్రారంభంకానుంది. దీంతో ఆయన ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. 
 
గత శుక్రవారం విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీచేసింది. అయితే, తన తల్లి సోనియా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, అందువల్ల సోమవారానికి విచారణ వాయిదా వేయాలని రాహుల్ కోరారు. దీంతో 20వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా అధికారులు ఆదేశించారు. 
 
మరోవైపు, ఈడీ విచారణను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు చేయాలని పిలుపునిచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతీకార రాజకీయ దాడులు, అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు శాంతియుతంగా సోమవారం నిరసనలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు