ఇదే పరిస్థితి కొనసాగితే దేశం రెండుగా విడిపోతుంది : కర్నాటక ఎంపీ డీకే సురేశ్

వరుణ్

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (15:54 IST)
దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, ఇదేపరిస్థితి కొనసాగితే దేశం రెండుగా విడిపోతుందని కర్నాటక ఎంపీ సురేశ్ కుమార్ జోస్యం చెప్పారు. తాజాగా కేంద్ర మంత్రి మధ్యంతర బడ్జెట్ 2024-25లో బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు సరైన కేటాయింపులు లేవంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ సమస్యను పరిష్కరించకపోతే దక్షిణాది రాష్ట్రాలను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తామని హెచ్చరించారు. కేంద్ర నిధుల్లో తమకు తగిన వాటా రావట్లేదంటూ పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఇప్పటికే తమ అసంతృప్తి వ్యక్తంచేశాయి. తాజాగా కర్ణాటక కూడా ఈ జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో ఎంపీ సురేశ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 
 
ప్రతి దశలోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఎంపీ సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నిధుల్లో మా వాటా మాకు కావాలి. జీఎస్టీ, కస్టమ్స్, డైరెక్టు ట్యాక్స్ ఇలా పన్నులు ఏవైనా మా వాటాలు మాకు చెల్లించాలి. అభివృద్ధి నిధుల్లో మా వాటాను ఉత్తరాదిలో పంచిపెడుతున్నారు. హిందీ ప్రాంత పరిస్థితులు మాపై ఇలాగే రుద్దితే దక్షిణాదిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేయాల్సి ఉంటుంది' అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
కేటాయింపుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్పందిస్తూ గతేడాది కార్పొరేట్, ఇతర పన్నుల కింద కర్ణాటక రూ.2.25 లక్షల కోట్లు చెల్లిస్తే టాక్స్ డివల్యూషన్ కింద కేవలం రూ.37,252 కోట్లే వచ్చాయన్నారు. జీఎస్టీ కింద రాష్ట్రం రూ.1.4 లక్షల కోట్లు చెల్లిస్తే రాష్ట్రానికి ఇందులో వాటాగా రూ.13,005 కోట్లే వచ్చాయన్నారు. 
 
వివిధ పన్నుల కింద కర్ణాటక గతేడాది రూ.4 లక్షల కోట్లు వసూళ్లు సాధించిందని, కానీ రాష్ట్ర వాటాగా కేవలం రూ.50,257 కోట్లే వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్రం కనీసం రూ.లక్ష కోట్లు కర్ణాటకకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా ఓ కూటమి ఏర్పాటు చేసే యోచనలో కూడా ఉన్నట్టు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ హయాంలో పన్నులకు సంబంధించి రాష్ట్ర వాటా 4.71 శాతం నుంచి 3.64 శాతానికి పడిపోయిందని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు