మేఘాలయాకు హనీమూన్కు వెళ్లిన దంపతుల్లో భర్త హత్యకు గురయ్యాడు. దీనిపై పోలీసులు ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. మృతుడి భార్యే హత్యకు ప్రధాన సూత్రధారి అని తేలింది. తన ప్రియుడుతో కలిసి కొందరు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేసినట్టు నిర్ధారించారు. అయితే, ఆమె చేసిన ఒకే ఒక్క తప్పుతో ప్లాన్ మొత్తం తారుమారైపోయిది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్కు చెందిన రాజా రఘవంశీ - సోనమ్కు మే 11వ తేదీన వివాహం జరిగింది. 20న హనీమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. అయితే వారు మొదట జమ్మూకాశ్మీర్కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అక్కడ అప్పటికే పహల్గాం ఉగ్రదాడి జరిగడంతో వారు మేఘాలయకు తమ హనీమూన్ ప్లాన్ మార్చుకున్నారు. అక్కడే రెండు రోజుల తర్వాత వారి ఆచూకీ గల్లంతయింది.
ఈ హత్య కోసం విశాల్ చౌహాన్, ఆనంద్ కుమార్, ఆకాశ రాజ్పుత్లకు రాజ్ కుశ్వాహా సుపారీ ఇచ్చాడు. మరోవైపు మేఘాలయ వెళ్లేందుకు సోనమ్ తన భర్తను ఒప్పించగలిగిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అంతా వారి ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే హత్యకు వారు ఉపయోగించిన పదునైన ఆయుధంతో అంతా తారుమారు అయినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఆయుధాన్ని సాధారణంగా మేఘాలయలో ఉపయోగించరు. దాంతో బయటివ్యక్తి ప్రమేయం ఉందని మాకు అనుమానం వచ్చింది. తర్వాత మేం కాల్ రికార్డులను పరిశీలించాం అని పోలీసు అధికారి వెల్లడించారు.
ఈ హత్యకు ముందు సుపారీ ఇచ్చిన వ్యక్తుల్లో ఒకరిని సోనమ్ కాంటాక్ట్ చేసిందని గుర్తించామన్నారు. రాజా, సోనమ్ ఆచూకీ గల్లంతు కావడానికి ముందు ఆమె ఫోన్ లొకేషన్తో, నిందితుల ఫోన్ లొకేషన్ మ్యాచ్ అయినట్లు చెప్పారు. కేసు విచారణలో భాగంగా పోలీసు కస్టడీలో ఉన్న సోనమ్ సహా మిగతా నిందితులను మేఘాలయకు తీసుకెళ్తున్నారు.