దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:27 IST)
ఈ వారం మొదట్లో తగ్గినట్టే కనిపించిన కరోనా కేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే తాజాగా 3.6 శాతం మేర పెరిగి కేసులు 35 వేలకు చేరాయని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.

ఒక్క కేరళలోనే 22 వేల కేసులు వెలుగుచూశాయి. సగానికి పైగా కేసులు ఆ ఒక్క రాష్ట్రంలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో 3,595 మంది వైరస్‌ బారినపడ్డారు.
 
24 గంటల వ్యవధిలో 35,662 మందికి కరోనా సోకింది. 281 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.34 కోట్లకు చేరగా.. 3.26 కోట్ల మంది వైరస్‌ను జయించారు. నిన్న ఒక్కరోజే 33వేల మంది కోలుకున్నారు.

ప్రస్తుతం 3.4 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. గత ఏడాది జనవరి నుంచి మహమ్మారి కారణంగా 4,44,529 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 1.02 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.65 శాతానికి చేరింది. నిన్న 14.48 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు