3T అమలుతోనే కరోనా అదుపు!

బుధవారం, 17 జూన్ 2020 (09:16 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాలు సరిగ్గా టెస్టులు చేయడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై తాజాగా నీతి అయోగ్ చైర్మన్ అమితాబ్ కాంత్‌ స్పందించారు. 
 
‘తగినన్ని కరోనా టెస్టులు చేయకుండా కరోనా కట్టడి అసాధ్యమని.. దీని వల్ల ఎప్పటికైనా ముప్పు తప్పదని ఆయన అన్నారు. 3T( టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌) వ్యూహంతో కరోనాను కట్టడి చేయవచ్చని.. ప్రస్తుతం కర్ణాటక, కేరళ, దక్షిణ కొరియా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
 
3T వ్యూహం అంటే ఏంటి.?
ట్రేసింగ్: విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా పరీక్షలు నిర్వహించి.. వారిలో ఎవరికైనా కరోనా ఉంటే.. వారిని కలిసిన వారిని వెంటనే గుర్తిస్తారు.
 
టెస్టింగ్: ఏదైనా ప్రాంతంలో కరోనా కేసు బయటపడితే.. ఆ ప్రాంతంలో ఇంటింటికీ కరోనా టెస్టులు చేయాలి.
 
ట్రీట్‌మెంట్‌: కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. దీనితో కరోనా మరణాలను తగ్గించవచ్చు. క్వారంటైన్, చికిత్సకు అవసరమయ్యేలా అదనపు పడకలను కూడా ఏర్పాటు చేసుకోవాలి
 
"3T వ్యూహంతోనే కర్ణాటక ముందుకు..
కర్ణాటక రాష్ట్రం 3T వ్యూహంతోనే ముందుకు వెళ్తోంది. దేశంలో కేసులు పెరుగుతున్నా.. కర్ణాటకలో మాత్రం వైరస్ అదుపులోనే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
ఎందుకంటే దేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన మెట్రో నగరాల్లో ఒకటైన బెంగళూరులో తక్కువ కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం అని చెబుతున్నారు. 
 
ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 6824 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. బెంగళూరులో ఇప్పటివరకు 648 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 
 
అందులో 464 మంది కోలుకున్నారని అక్కడి అధికారులు వెల్లడించారు. యడ్యూరప్ప సర్కార్ నాలుగో టీగా టెక్నాలజీని ఉపయోగిస్తూ.. కర్ణాటకలో కరోనా కట్టడికి 3టీ వ్యూహాన్ని అమలు చేస్తూ.. వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు