ఆసుపత్రి నుంచి పారిపోతున్న'కరోనా' రోగులు

మంగళవారం, 17 మార్చి 2020 (07:52 IST)
జగిత్యాల, కడప, అలప్పుళ, ఢిల్లీ.. ఎక్కడైనా అంతే. ఆసుపత్రి నుంచి పారిపోవడమే. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గదుల్లో ఒంటరిగా ఉంచడంతో వారు నిర్బంధం తట్టుకోలేక పారిపోతున్నారు. కరోనా వైరస్ ఎక్కడ తమకు సోకుతుందోనని ప్రజలు భయపడుతుంటే.. సోకినవాళ్లతో ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడ్డట్టైంది.

వారు అలా ఆసుపత్రి నుంచి పారిపోతే వారినుంచి ఇతరులకు ఆ వ్యాధి సోకవచ్చు అని జనాలు బెదిరిపోతున్నారు? మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ లక్షణాలతో చేరిన నలుగురు వ్యక్తులు వైద్యులకు చెప్పకుండానే ఇంటికి వెళ్లిపోవడం కలకలం సృష్టించింది.

కరోనా అనుమానంతో ఇద్దరు పురుషులు, మరో ఇద్దరు మహిళలు ఇందిరా గాంధీ ప్రభుత్వ మెడికల్ కళాశాల, అసుపత్రిలో చేరారు. ఐసోలేషన్‌ వార్డులో ఉంచి వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితాలు రాకముందే ఆ నలుగురూ ఎవ్వరికీ చెప్పకుండా శుక్రవారం రాత్రి ఆసుపత్రి నుంచి పారిపోయారు.

దీంతో ఆసుపత్రి వర్గాలు తల పట్టుకున్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు వాళ్ల అడ్రస్ గుర్తించారు. వాళ్లను తిరిగి ఆసుపత్రిలో చేరాలని చెప్పినట్టు తెలిపారు.

తమ పరీక్ష ఫలితాలు ఆలస్యం కావడంతో పాటు అదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కరోనా బాధితులకు కేటాయించిన టాయిలెట్లను ఉపయోగించాలని చెప్పడంతో భయపడి బయటకు వచ్చేశామని ఆ నలుగురు తమకు చెప్పారని పోలీసులు వెల్లడించారు.

నాగ్‌పూర్‌‌లో ఇప్పటిదాకా 19 మంది కరోనా అనుమానితులను గుర్తించగా.. వారిలో ముగ్గురికి వైరస్ పాజిటివ్ వచ్చింది. మరోవైపు కేరళలోని అలప్పుళ మెడికల్ కాలేజీ నుంచి ఇద్దరు విదేశీయులు పారిపోయారు.

దోహా నుంచి వచ్చిన ఆ ఇద్దరు కొచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకుని కొచ్చి ఎయిర్ పోర్టుకు చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఎర్నాకుళం ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు