కరోనా వ్యాక్సిన్లు - తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

గురువారం, 7 జనవరి 2021 (10:42 IST)
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది. అత్యవసర వినియోగానికి సంబంధించి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ) కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లకు ఈనెల 3వ తేదీన అనుమతిచ్చింది. అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన 10 రోజుల్లోపే వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు కేంద్రఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. ఆక్స్ ఫర్డ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. మరోపక్క హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ను తయారు చేస్తోంది. 
 
తొలిదశలో టీకా కార్యక్రమం వైద్యులకు, వైద్య సిబ్బందికి, కరోనాపై పోరులో ముందువరుసలో నిలిచిన యోధులు.. అంటే పారిశుధ్య సిబ్బంది, పోలీసులు తదితరులకు ప్రభుత్వమే టీకా వేయించనుంది. ఇందుకోసం వారు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పటికే వారి పేర్లు కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నాయి. పాపులేషన్‌ ప్రయారిటీ గ్రూప్‌ వారు అంటే 50 ఏళ్లు దాటి, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారి కోసం రిజిస్ట్రేషన్‌ సౌకర్యం అందుబాటులో ఉంచనున్నారు. 
  
వ్యాక్సిన్ భద్రత, సైడ్ ఎఫెక్ట్స్:
భద్రత విషయంలో ఏ మాత్రం తేడా ఉన్నా తాము ఆమోదం తెలపమని భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ) డైరెక్టర్ వీజీ సోమానీ తెలిపారు. ఈ వ్యాక్సిన్లు 110% సురక్షితమని ప్రకటించారు. కొద్దిపాటి జ్వరం, నొప్పి, అలర్జీ లాంటి స్వల్ప లక్షణాలు ఉంటాయని వెల్లడించారు. 
 
నిర్వహణ ప్రక్రియ:
ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అమెరికా ఫైజర్-బయోటెక్, యూకేలో మోడెర్నా వ్యాక్సిన్లకు ఆమోదముద్ర పడ్డ 1-2 రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. దీనికి ప్రత్యేక టైమ్ లైన్ అంటూ ఏమీ ఉండదు. 
 
వ్యాక్సిన్ ముందుగా ఎవరికి:
భాతర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించినట్టుగా తొలుత 3 కోట్ల మంది ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ 3 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. 
 
మిగతా ప్రజల పరిస్థితి ఏమిటి?
దేశంలోని ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వడంపై క్లారిటీ వచ్చింది. అయితే దేశంలో మిగిలిన ప్రజలకు ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆగస్టు 2021 నాటికి తొలి విడత వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాతే మిగిలిన జనాభాకు వ్యాక్సిన్ వేస్తారు. 
 
కరోనా నుంచి కోలుకున్నా వ్యాక్సిన్ వేయించుకోవాలా?
అవును. కరోనా నుంచి కోలుకున్నా వ్యాక్సిన్ వేయించుకోవాలి. కరోనా వచ్చిందా? రాలేదా? అనే దానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనివల్ల రోగనిరోధక శక్తి సామర్థ్యం పెరుగుతుందని తెలిపింది. 
 
ఎన్ని డోసులు వేయించుకోవాలి?
ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరూ 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల టీకాలు వేయించుకోవాలి. రెండో డోసు వేయించుకున్న రెండు వారాల తర్వాత శరీరంలో కరోనాతో పోరాడే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని తెలిపింది.
 
రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులు తీసుకోవచ్చా?
లేదు తీసుకోకూడదు. రెండు డోసులు ఒకే వ్యాక్సిన్ వి అయి ఉండాలని కేంద్రం తెలిపింది. వేర్వేరు వ్యాక్సిన్లను తీసుకోవద్దని స్పష్టం చేసింది.
 
ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
కరోనా వ్యాక్సిన్ వేయించుకునేవారు Co-WIN సైట్ లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ముందుగా రిజిస్టర్ చేసుకున్నవారికే వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుంది. అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే కుదరదు. 
 
రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం:
కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే వారు ఈ కింద ఇవ్వబడిన డాక్యుమెంట్లలో ఏదో ఒకటి ఉండాలి. 
1. డ్రైవింగ్ లైసెన్స్
2. ఉపాధి హామీ జాబ్ కార్డు
3. పాన్ కార్డు
4. బ్యాంకు పాస్ బుక్
5. పాస్ పోర్టు
6. పెన్షన్ డాక్యుమెంట్
7. ఓటర్ ఐడీ
8. ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అధికారిక ఐడీలు
9. ప్రభుత్వం ఇచ్చే సర్వీసు ఐడీ
10. కార్మిక శాఖ ఇచ్చే ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు