సాదాసీదాగా మాజీ సీఎం కుమారుడి వివాహం... ఎక్కడ?

శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (11:36 IST)
కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి.కుమార స్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి గౌడ వివాహం అత్యంత సాదాసీదాగా శుక్రవారం జరిగింది. కర్నాటక రాష్ట్రంలోని రామనగర జిల్లాలో ఉన్న తమ సొంత ఫాంహౌస్‌లో ఈ వివాహం నిరాడంబరంగా ముగిసింది. 
 
నిజానికి ఈ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏప్రిల్ 17వ తేదీన ముహూర్తంగా ఖరారు చేసుకున్నారు. అయితే, కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కబళించింది. ఈ వైరస్ మన దేశంలోనూ శరవేగంగా విస్తరిస్తోంది. ఫలితంగా ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. 
 
దీంతో అనేక మంది సెలెబ్రిటీలు తమతమ వివాహాలను రద్దు చేసుకున్నారు. కానీ, కుమారస్వామి మాత్రం అనుకున్న సమయానికే ఈ వివాహం జరిపించారు. రాంనగర్ జిల్లాలోని బిడాడీ ఫాంహౌస్‌లో నిరాడంబరంగా పెళ్లి తంతును పూర్తిచేశారు. పెళ్లిలో జరగాల్సిన సంప్రదాయ ఉత్సవాలన్నింటినీ రద్దు చేసి కేవలం ప్రధాన కార్యక్రమాలను మాత్రమే నిర్వహించి వధువు మెడలో మూడుముళ్లు వేయించారు. 
 
కాగా, కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడకు, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం.క్రిష్ణప్ప మనుమరాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 17వ తేదీన జనపదలోకలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలని అప్పుడే నిర్ణయించారు. ఈలోగా లాక్‌డౌన్‌ వచ్చిపడినప్పటికీ ఈనెల 14వ తేదీతో ముగియనున్నందున పెళ్లికి ఇబ్బంది లేదని రెండు కుటుంబాల వారూ భావించారు.
 
కానీ లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించడం, లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు భారీ ఫంక్షన్లకు అవకాశం లేకపోవడంతో పరిమిత సంఖ్యలో అతిథులతో ఫాంహౌస్‌లో పెళ్లి వేడుకను నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా కుమార్ స్వామి మాట్లాడుతూ పెళ్లి వేడుకకు తమ రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత ముఖ్యమైన అతిథులు తప్ప మరెవరినీ ఆహ్వానించలేదని, నాయకులు, శ్రేణులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని పెళ్లి మండపం వద్దకు రావద్దని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు