చోరీ(హైజాక్)కి గురైన టమోటా లారీ... ఎలా.. ఎక్కడ?

సోమవారం, 24 జులై 2023 (10:53 IST)
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమోటాల ధర విపరీతంగా పెరిగిపోయింది. ఒక కేజీ టమోటాలు దాదాపుగా రూ.200 మేరకు పలుకుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ టమోటా ధఱలు రూ.150కి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టమోటా చోరీ ఎక్కువైంది. ఒకప్పుడు ధర లేక రైతులు రోడ్డుపక్కన పారబోసినస్థితి నుంచి, ఇప్పుడు అత్యంత ప్రియంగా మారిన స్థితికి టమాటా ధరలు చేరుకున్నాయి. ముఖ్యంగా, ఈ టమోటాల కోసం ఏకంగా హత్యలే జరుగుతున్నాయి. తాజాగా టమోటా లోడుతో వెళుతున్న ఓ లారీ చోరీ (హైజాక్)కి గురైంది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.
 
ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు భాస్కరన్ (38), సింధుజ (35) అనే దంపతులను తమిళనాడులో అరెస్టు చేశారు. ఆ దంపతులు చోరీ చేసిన టమాటా లోడును తమిళనాడులో రూ.1.6 లక్షలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అసలు, ఈ టమాటా మినీ లారీ దొంగతనం సినీ ఫక్కీలో జరిగింది.
 
ఎలా జరిగిందో పరిశీలిస్తే, జులై 8వ తేదీన శివన్న అనే లారీ డ్రైవర్ ఆర్ఎంసీ యార్డ్ పోలీసులను ఆశ్రయించాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన మినీ లారీని ఎత్తుకెళ్లారని శివన్న ఫిర్యాదు చేశాడు. అందులో 210 ట్రేల నిందా టమోటాలు ఉన్నాయని, వాటి విలువ రూ.1.5 లక్షలు ఉంటుందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
 
చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్ నుంచి కోలార్ ప్రాంతానికి ఆ టమోటాలు తీసుకెళుతున్నానని, అయితే, గోరగుంటపాళ్య వద్ద చిన్న యాక్సిడెంట్ జరిగిందని శివన్న పోలీసులకు వివరించాడు. నీ మినీ లారీ మా మహీంద్రా జైలో వాహనాన్ని ఢీకొట్టిందని కొందరు వచ్చి తనతో వాగ్వాదం పెట్టుకున్నారు అని వెల్లడించాడు.
 
మహీంద్రా జైలో వాహనంలోని వ్యక్తులు తనతో గొడవపెట్టుకున్నారని, నష్ట పరిహారం కింద రూ.50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారని, కానీ తాను అందుకు నిరాకరించడంతో టమోటా లోడుతో ఉన్న తన మినీ లారీని ఎత్తుకెళ్లారని శివన్న వివరించాడు.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఇదొక ఘర్షణ కేసుగా భావించారు. యాక్సిడెంట్ సందర్భంగా గొడవ జరిగి ఉంటుందని, ఆ కోపంలో లారీని ఎత్తుకెళ్లి ఉంటారని అనుకున్నారు. అయితే, ఈ కేసులో సీసీటీవీ ఫుటేజి పరిశీలిస్తే కేసును మలుపు తిప్పిన అంశం వెల్లడైంది.
 
టమోటా లారీ, మహీంద్రా జైలో వాహనాలు తమిళనాడులోని వాణియంబాడి వైపు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజి ద్వారా వెల్లడైంది. అయితే, ఆ వ్యక్తులు చోరీ చేసిన వాహనం నెంబరు ప్లేటుపై ఉన్న అంకెలను చెరిపివేయడం అనుమానాలకు తావిచ్చింది. తమ మహీంద్రా జైలో వాహనం నెంబరు ప్లేటును మాత్రం యధాతథంగా ఉంచేయడంతో వారు దొరికిపోయారు.
 
దాదాపు 200 సీసీ టీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలించిన పోలీసులు... టమోటా లారీ చోరీకి పాల్పడిన వ్యక్తులను వాణియంబాడిలో వారి నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు భాస్కరన్‌పై ఇప్పటికే 10 దొంగతనం, దోపిడీ కేసులు ఉన్నట్టు గుర్తించారు.
 
టమోటా లారీని చోరీ చేసేందుకే యాక్సిడెంట్, నష్టపరిహారం అంటూ నాటకం ఆడారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న కుమార్, మహేశ్ అనే వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు