కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు

గురువారం, 4 ఫిబ్రవరి 2021 (13:27 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్ చేపట్టిన చర్యలను ప్రపంచ దేశాలన్నీ స్వాగతిస్తున్నాయి. భారత్ శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనా మినహా మిగతా ప్రపంచమంతా భారత్‌కు జేజేలు పలుకుతున్నాయి. అదేసమయంలో దేశీయంగా కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 
 
తొలి 40 లక్షల మందికి 18 రోజుల్లోనే టీకా వేశామని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లో బుధవారం నుంచి కొవాగ్జిన్‌ టీకా వాడకం ప్రారంభమైంది. కోల్‌కతాలోని మూడు వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 60 మంది ఆరోగ్య కార్యకర్తలకు ఈ టీకాను వేశారు.
 
జార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రి ‘మేదాంత’లో సోమవారం కరోనా టీకా వేయించుకున్న ఆరోగ్య కార్యకర్త మన్నూ పాహన్‌(52).. మంగళవారం రాత్రి మృతిచెందాడు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే మరణానికి గల కారణం తెలుస్తుందని ఆస్పత్రి సీఈవో డాక్టర్‌ పంకజ్‌ సాహ్ని వెల్లడించారు. 
 
మరోవైపు దేశంలో క్రియాశీల (యాక్టివ్‌) కరోనా కేసుల సంఖ్య 1.5 శాతం తగ్గి 1.60 లక్షలకు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 11,039 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1.07 కోట్లు దాటింది. మొత్తం మరణాలు 1.54 లక్షలు దాటాయి.
 
అయితే, దేశంలోని ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా ఇన్ఫెక్షన్‌ సోకి ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారవర్గాలు అంటున్నాయి. ఈ లెక్కన 135 కోట్ల దేశ జనాభాలో 30 కోట్ల మందికిపైగా ఇప్పటికే వైరస్‌ బారినపడి ఉండొచ్చని తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు