ముంచుకొస్తున్న బిపర్‌జాయ్ తుఫాను ముప్పు - గుజరాత్ హైఅలెర్ట్

బుధవారం, 14 జూన్ 2023 (09:27 IST)
బిపర్‌జాయ్ తుఫాను ముప్పు ముంచుకొస్తుంది. దీంతో గుజరాత్‌ రాష్ట్రంలోని పది జిల్లాలతో పాటు ముంబై నగరంలో హైఅలెర్ట్ ప్రకటించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకున్నాయి. 
 
ప్రస్తుతం ఈ పెను తుఫాను బిపర్‌జాయ్ తూర్పు - మధ్య అరేబియా సముద్రంలో పోరబందర్‌కు నైరుతి దిశగా 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారం సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో తుఫాన్ తీరం దాటనుంది. మంగళవారం గుజరాత్ అధికారులు తీర ప్రాంతాల్లోని సుమారు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 
 
రాష్ట్ర, కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచారు. సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించనున్నారు. రాష్ట్రంలో సహాయక ఏర్పాట్లపై మంగళవారం హోం మంత్రి అమిత్ షా వర్చ్యువల్‌గా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో సహాయక కార్యక్రమాలు చేపడుతోంది. తొలి విడతలో భాగంగా తీరానికి 5 కిలోమీటర్ల లోపు ఉన్నవారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండో విడతలో తీరానికి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న వారిని తరలిస్తారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం మొత్తం 17 కేంద్ర, 12 రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచారు. 
 
తుఫాను సమయంలో ప్రజల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ ఇప్పటికే 69 రైళ్లను రద్దు చేసింది. మరో 58 రైళ్ల ప్రయాణాన్ని కుదించింది. ఈ మేరకు రైళ్లు బయలుదేరే స్టేషన్, గమ్యస్థానాలకు మార్పులు చేసింది. గురువారం తుఫాను తీరం దాటే సమయంలో గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అహ్మదాబాద్ కార్యాలయం డైరెక్టర్ మనోరమా మహంతి పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు