బీహార్‌ను ముంచెత్తుతున్న వరదలు.. 21మంది మృతి

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (09:52 IST)
బీహార్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. నేపాల్‌లోని నదుల నుంచి బీహార్‌కు నీరు పోటెత్తడంతో రాష్ట్రంలోని 16 జిల్లాలు జలమయమయ్యాయి. వరదల ప్రభావంతో 21మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో 69 లక్షల మందికి పైగా నిరాశ్రయులైనారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.  రాష్ట్రంలోని సితామార్హి, సుపాల్‌, షియోహర్‌, తూర్పు చంపారన్‌, గోపాల్‌ గంజ్‌ సహర్సా, మాధేపుర, మధు బని, సమస్తిపూర్‌ జిల్లాలు వరద ప్రభావానికి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.
 
ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 4.82 లక్షల మందిని ఖాళీ చేయించగా.. వారిలో 12,239 మందిని ఎనిమిది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు 20కి పైగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు మోహరించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.
 
ఖగారియా జిల్లాలోని బుధి గండక్ నది వెంబడి ఉన్న ఆనకట్ట తెగిపోవడంతో వరదలు పోటెత్తాయి. అయితే ఆనకట్ట వద్ద మరమ్మత్తు పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, ప్రజలు భయాందోళనకు గురికావొద్దని జల వనరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు