కరోనా టీకా తర్వాత 1156 మంది మృత్యువాత.. కేరళలోనే అత్యధికం

సోమవారం, 3 ఏప్రియల్ 2023 (17:06 IST)
కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు, ఒకవేళ ఈ వైరస్ కోరల్లో చిక్కినప్పటికీ ప్రాణాపాయం లేకుండా ఉండేందుకు దేశంలోని పౌరులందరికీ కరోనా టీకాలు వేశారు. అయితే, ఈ టీకాలు వేసుకున్న తర్వాత అనేక మంది చనిపోతున్నారు. దీనికి కారణం కరోనా దుష్ప్రభావాల కారణంగానే ఈ పరిస్థితి ఎదరువుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ టీకాలు తీసుకున్న వారిలో ఇప్పటివరకు 1156 మంది చనిపోయారు. ఈ మరణాల్లో అత్యధికంగా ఒక్క కేరళ రాష్ట్రంలో 244 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 37 మంది చొప్పున చనిపోయారు. 
 
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన 2021 జనవరి 16వ తేదీ నుంచి ఈ యేడాది మార్చి 15వ తేదీ వరకు 1156 మంది చనిపోయినట్టు తేలింది. ఈ టీకాలు వేసుకున్న తర్వాత సంభవించిన మరణాలు, టీకాల దుష్ప్రభావాల సంఘటనలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 92479 ఈఎస్ఎఫ్ఐ ఘటనలు జరిగినట్టు వివరించింది. ఇందులో మైనర్, సివియర్, సీరియస్ ఘటనలు చోటు చేసుకున్నట్టు పేర్కొంది. రాష్ట్రాల వారీగా సంభవించిన మరణాలను కూడా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
టీకా వేసుకున్న తర్వాత సంభవించిన మరణాల్లో దేశంలోనే అత్యధికంగా కేరళలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 244 మంది మృత్యువాతపడ్డారు. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. అక్కడ 102 మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో 86, మధ్యప్రదేశ్‌లో 85, కర్నాటకలో 75, వెస్ట్ బెంగాల్‌లో 70, బిహార్‌లో 62, ఒడిసాలో 50, తమిళనాడులో 44, తెలంగాణాలో 37, ఆంధ్రప్రదేశ్‌లో 37 మంది చొప్పున చనిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు