నా సొంత వ్యాఖ్యలే నన్ను గాయపరుస్తున్నాయి. : ఉమాభారతి

గురువారం, 23 సెప్టెంబరు 2021 (08:37 IST)
ప్రభుత్వ అధికార వ్యవస్థ ఓ మిథ్య.. అధికారులు ఉన్నది రాజకీయ నేతల చెప్పులు మోయడానికేనంటూ తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. 
 
ఈ వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధపెట్టాయన్నారు. తాను అలా మాట్లాడి ఉండాల్సిందికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు లేఖ రాసిన ఉమాభారతి.. తాను వాడే భాషను మరింతగా మెరుగుపరుచుకుంటానని హామీ ఇచ్చారు. 
 
శనివారం కొందరు ఓబీసీ నేతలు భోపాల్‌లో తన నివాసానికి వచ్చి కలిసిన సందర్భంగా బ్యూరోక్రసీపై ఉమాభారతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోమవారం సామాజిక మాధ్యల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 
 
దీనిపై కాంగ్రెస్‌నేత దిగ్విజయ్‌సింగ్‌ తీవ్రంగా స్పందించారు. ఆ భాష తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఇందుకుగాను ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో మంగళవారం ఉమాభారతి దిగ్విజయ్‌ సింగ్‌కు లేఖ రాశారు. 
 
'నా సొంత వ్యాఖ్యలే నన్ను గాయపరుస్తున్నాయి. తీవ్ర పదజాలం వాడొద్దని నేను మీకు పదేపదే చెప్పేదాన్ని. ఇప్పట్నుంచి నేను నా భాషను మెరుగుపరుచుకుంటాను. మీరూ అలా చేయగలిగితే చేయండి' అని లేఖలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు