వైఎస్ అవినాష్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. అరెస్టుకు లైన్ క్లియర్!

సోమవారం, 24 ఏప్రియల్ 2023 (16:14 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్ అయింది. ఆయన దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన్న మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో ఏ క్షణమైనా ఆయన అరెస్టు కావొచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు వైఎస్ వివేకానంద రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. 
 
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ ఉత్తర్వులు జారీచేసింది. వీటిని సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ జారీ చేసిన తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది. అదేసమయంలో వివేకా హత్య కేసుకు విధించిన గడువును కూడా సుప్రీంకోర్టు జూన్ 30వ తేదీ వరకు పొడగించింది. 
 
మరోవైపు, విచారణ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఉత్తర్వులు తప్పుడు సంప్రదాయాలకు దారితీస్తాయంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దీంతో అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్ అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు