ఉమ్మడి పౌరస్మృతిపై చర్య అంతర్యుద్ధానికి దారితీస్తుందా : కౌంటర్ ఇచ్చిన వెంకయ్య

శుక్రవారం, 14 అక్టోబరు 2016 (14:07 IST)
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై బహిరంగ చర్చకు న్యాయకమిషన్ విడుదలచేసిన ప్రశ్నావళి వివాదం రాజుకుంటోంది.  దీన్ని అమలుచేస్తే దేశంలో అంతర్యుద్ధానికి దారి తీస్తుందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ), ఇతర ముస్లిం సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అయినప్పటికీ.. ఈ అంశంపై తమ వైఖరి మార్చుకోబోమని కేంద్రం తెగేసి చెప్పింది. ఈ వ్యాఖ్యలపై ముస్లిం పెద్దలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ముస్లిం లా బోర్డు పెద్దలు వ్యక్తం చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఖండించారు. ఉమ్మడి పౌర స్మృతి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదని గుర్తు చేశారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే ఉమ్మడి పౌర స్మృతి అని పేర్కొన్నారు. తలాక్ చెప్పే వ్యవస్థ మంచిది కాదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. 
 
రాజకీయాల్లోకి రావాలనుకుంటే మద్దతిచ్చే వారితో వెళ్లండని సూచించారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధానిని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవడం మంచిదికాదన్నారు. తలాక్ చెప్పే వ్యవస్థను రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. మూడు సార్లు తలాక్ చెప్పే వ్యవస్థపై ప్రజల్లో తీవ్రంగా చర్చ జరగాలని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి