బంద్‌కు మద్దతు లేదు.. కానీ రైతులకు అండగా ఉంటాం.. జైలుకెళతానంటున్న మమతా

సోమవారం, 7 డిశెంబరు 2020 (21:49 IST)
వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గట్టివార్నింగ్ ఇచ్చారు. రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్న కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అధికారం నుంచి వైదొలగాలని అన్నారు. రైతుల ఆందోళనకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.
 
అదేసమయంలో రైతుల హక్కులను కాలరాస్తున్న బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. బీజేపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని... జైలుకు వెళ్లడానికి కూడా తాను సిద్ధమేనని తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్‌కు టీఆర్ఎస్ సహా పలు పార్టీలు మద్దతు పలికాయి. 
 
మరోవైపు, పార్లమెంటులో అప్రజాస్వామికంగా రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆమోదించిన మూడు  రైతు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లు 2020 రద్దుచేయాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాల డిమాండ్లకు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి మద్దతును ఇస్తున్న‌ట్లు స‌ర్కిల్ కార్య‌ద‌ర్శి జే సంప‌త్ రావు ప్ర‌క‌టించారు. 
 
వ్య‌వ‌సాయ రంగాన్ని కార్పొరేట్ల‌కు అప్ప‌గించి, రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర లేకుండా చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ చ‌ట్టాలు ఆహార భ‌ద్ర‌త‌కు ముప్పు తెచ్చేలా ఉన్నాయ‌న్నారు. ఇప్ప‌టికే రైతుల ఆందోళ‌న‌ల‌కు మ‌ద్దతుగా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియ‌న్ స‌భ్యులు భోజ‌న విరామ స‌మ‌యంలో నిర‌స‌న తెలిపింద‌న్నారు. భార‌త్ బంద్‌కు మ‌ద్ద‌తుగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు న‌ల్ల బ్యాడ్జిలు ధ‌రించి నిర‌స‌న తెల‌పాల‌ని జే సంప‌త్ రావు విజ్ఞ‌ప్తి చేశారు.
 
ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకే... 
కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన రైతులు రోడ్డెక్కారు. ఈ ఆందోళన గత 12 రోజులుగా సాగుతోంది. ఛలో ఢిల్లీ పేరుతో ఈ ఆందోళన చేపట్టారు. కానీ, రైతులను హస్తినలో అడుగుపెట్టనీయకుండా ఢిల్లీ పోలీసులు కరోనా ఆంక్షల పేరుతో ఢిల్లీ సరిహద్దుల్లోనే కట్టడి చేశారు. 
 
అటు కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఇటు పోలీసుల దమనకాండకు నిరసనగా రైతు సంఘాలు మంగళవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
 
బంద్ ప్రారంభమయ్యే 11 గంటల లోపు అందరూ వారి కార్యాలయాలకు వెళ్లొచ్చని... 3 గంటలకు బంద్ ముగిసిన తర్వాత ఇళ్లకు చేరుకోవచ్చని టికాయత్ తెలిపారు. అంబులెన్స్‌లను అడ్డుకోబోమన్నారు. ముందుగా నిశ్చయించుకున్న ముహుర్తాలకే పెళ్లిళ్లు యధావిధిగా జరుపుకోవచ్చని అన్నారు. 
 
కేవలం తమ నిరసనను వ్యక్తం చేయడానికి మాత్రమే బంద్ చేపడుతున్నామని, శాంతియుతంగా బంద్ కొనసాగుతుందని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలు తమకు సమ్మతం కాదనే విషయాన్ని చెప్పడానికే బంద్ చేపడుతున్నామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు