వంద మంది గ్యాంగ్‌స్టర్లను మట్టుబెట్టిన పోలీస్ అధికారికి జైలుశిక్ష

ఠాగూర్

బుధవారం, 20 మార్చి 2024 (16:44 IST)
నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో వందమంది గ్యాంగ్‌స్టర్లను మట్టుబెట్టిన మహారాష్ట్రకు చెందిన మాజీ పోలీస్ అధికారి ప్రదీప్ శర్మకు కోర్టు జైలుశిక్ష విధించింది. 2006లో జరిగిన గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ అనుచరుడు రాంనారాయణ్ గుప్తాను కాల్చి చంపిన కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరుగడించిన ప్రదీప్ శర్మ జీవిత చరిత్రను ఓసారి పరిశీలిస్తే, 
 
1983లో పోలీసు ఉద్యోగంలో చేరిన ప్రదీప్ శర్మ.. ముంబై అండర్‌వర్డల్ డాన్ చోటా రాజన్‌, ఇతర గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించారు. ఒకే ఏడాదిలో రాజన్ అనుచరుడు వినోద్ మట్కర్, దావూద్ ఇబ్రహీంకు చెందిన డి-కంపెనీ గ్యాంగ్‌స్టర్ సాదిఖ్ కాలియాను ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపారు. 2003లో లష్కరేతొయిబా అనుమానితులను శర్మ బృందం మట్టుపెట్టింది. అయితే అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2008లో విధుల నుంచి తొలగించారు. అయితే 2009లో తిరిగి బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.
 
నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో 2010లో ఆయనను అరెస్టు చేశారు. ఆ ఎన్‌కౌంటర్‌లో రాంనారాయణ్‌ గుప్తా అలియాస్‌ లఖన్‌ భయ్యా మృతి చెందాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. నాలుగు సంవత్సరాల శిక్ష అనంతరం 2013లో బయటకు వచ్చారు. 2019లో తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన.. ఆ వెంటనే శివసేనలో చేరారు. తర్వాత ఆ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ఓటమి చవిచూశారు.
 
తాజాగా రాంనారాయణ్‌ గుప్తా ఎన్‌కౌంటర్ కేసులో దోషిగా నిర్ధారించిన బాంబే హైకోర్టు.. జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. అలాగే ప్రదీప్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ 2013లో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఈ సందర్భంగా తప్పు పట్టింది. ఇదే కేసుకు సంబంధించి పోలీసు సిబ్బంది సహా 13 మందికి జీవితఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. మరో ఆరుగురికి ఆ శిక్షను రద్దు చేసి నిర్దోషులుగా ప్రకటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు