ప్రతి స్మార్ట్‌ఫోనులో ఎఫ్ఎం రేడియో ఉండాల్సిందే... కేంద్ర ఆదేశాలు

ఆదివారం, 7 మే 2023 (10:13 IST)
స్మార్ట్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియోలను ఖచ్చితంగా అమర్చాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. సమాచారం వ్యాప్తిలో డిజిటల్ అంతరాయం తగ్గించేందుకు ఎఫ్.ఎం. రేడియో అవసరమని కేంద్రం గుర్తించింది. పైగా, అత్యవసర పరిస్థితుల్లో ఎఫ్ఎం రేడియో సేవలు కీలకమని తెలిపింది. అందువల్ల స్మార్ట్ ఫోన్లలో విధిగా ఎఫ్ఎం రేడియోలు ఉండేలా స్మార్ట్ ఫోన్ తయారీదారులు చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 
 
సమాచారం, వినోదం ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు ఎఫ్.ఎం.రేడియోలు అవసరమని తెలిపింది. అంతేకాకుండా, అత్యవసర పరిస్థితులు, విపత్తులు, ప్రమాదాలు జరిగిన సందర్భలాల్లో ఎఫ్.ఎం.రేడియో సేవలు ఎంతో కీలకంగా మారుతాయని పేర్కొంది. ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ మొబైల్ తయారీదారుల సంఘాలైన ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్, మ్యానుఫాక్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి లిఖితపూర్వక సూచనలు జారీ చేసింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలోఎఫ్.ఎం రేడియోలు కీలక పాత్రను పోషిస్తాయని పేర్కొంది. 
 
పైగా ఇటీవలికాలంలో మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో సదుపాయం లేకపోవడాన్ని తాము గుర్తించినట్టు ఐటీ మంత్రిత్వ శాఖ తన నోటీసుల్లో పేర్కొంది. ఇది పేద ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తెలిపింది. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు సంభవించినపుడు పేద ప్రజలు ప్రభుత్వం సమాచారం కోసం ఎఫ్.ఎం రేడియోలపైనే ఆధారపడతారని పేర్కొంది. అందువల్ల స్మార్ట్ ఫోన్లతో పాటు స్టాండ్ ఎలోన్ రేడియోలు, కార్లలో రేడియో రిసీవర్లూ అవసరమని కూడా ఐటీ శాఖ జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు