క్లోమగ్రంథి కేన్సర్‌తో తుదిశ్వాస విడిచిన సర్జికల్ స్ట్రైక్స్ వ్యూహకర్త

సోమవారం, 18 మార్చి 2019 (09:43 IST)
కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 63 యేళ్లు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన... ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో చనిపోయారు. 
 
గత కొంతకాలంగా క్లోమగ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయన.. ఇటివల అమెరికాకు వెళ్లి చికిత్స కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. 
 
ఆ తర్వాత ముక్కులో ఓ ట్యూబ్ పెట్టుకునే విధులకు హాజరై సంచలనంగా మారారు. కొన్నిరోజులుగా పారికర్ పరిస్థితి విషమంగా మారడంతో ఆయన బతికే అవకాశాలు తక్కువంటూ ప్రచారం జరిగింది. పారికర్ మరణంతో బీజేపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. పారికర్ గతంలో దేశ రక్షణ మంత్రిగానూ విశేష సేవలందించారు.
 
కాగా, మనోహర్ పారీకర్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రతండాలపై భారత వాయుసేన మెరుపుదాడులు నిర్వహించింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ పూర్తిగా వ్యూహరచన చేసింది ఆయనే కావడం గమనార్హం. ఎంతో సౌమ్యుడిగా పేరున్న పారికర్ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కంటే గతంలో భారత రక్షణ మంత్రిగా వ్యవహరించినప్పుడే ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. 
 
యూరీ సైనిక స్థావరంపై తీవ్రవాదులు దాడి తర్వాత భారత ఆర్మీకి పారికర్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దాని ఫలితమే పీఓకేలో భారత బలగాలు ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి, విజయవంతంగా తిరిగొచ్చాయి. ఆ సర్జికల్ దాడుల తర్వాత భారత్ పేరు, పారికర్ పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోయాయి.
 
పొరుగుదేశంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేసేందుకు ఎక్కువగా శ్రమ తీసుకోకుండా ఖచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించుకుని పనిముగించింది. ఈ దాడులు మనోహర్ పారికర్ రక్షణమంత్రిగా ఉన్న సమయంలో జరగడంతో ఆయన దూకుడుకు మంచి గుర్తింపే లభించింది. ఈ విషయంలోనే కాదు, భారత సైన్యానికి అత్యాధునిక రాఫెల్ విమానాలు కొనుగోలు చేసి భారత వాయుసేనను శత్రు దుర్భేద్యం చేయాలన్న ఆలోచన కూడా పారికర్ హయాంలోనే మొదలైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు