అయోధ్యపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించడాన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, రామ జన్మభూమి రథయాత్రలో కీలక పాత్రధారి కేఎన్ గోవిందాచార్య స్వాగతించారు. పైగా, ఈ తరహా తీర్పు రావడానికి ప్రధాన కారణం వీహెచ్పీ నేత అశోక్ సింఘాల్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీలదే కృషి అని చెప్పుకొచ్చారు.
ఈ తీర్పుపై గోవిందాచార్య స్పందిస్తూ, అయోధ్య కేసులో తీర్పు తమకు అనుకూలంగా రావడానికి విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) నేత అశోక్ సింఘాల్, ఎల్కే అద్వానీ చేసిన కృషే కారణమన్నారు.
ఈ విజయానికి ప్రధాన కారణం ఎవరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. 'ఆలయ నిర్మాణం కోసం లక్షలాది మంది త్యాగాలు చేశారు. చాలా మంది అనేక రకాలుగా రామ జన్మభూమి ఉద్యమంలో తమ పాత్ర పోషించారు. కీలక భూమిక మాత్రం అశోక్ సింఘాల్, ఎల్కే అద్వానీదే' అని సమాధానం ఇచ్చారు.