అధికార ఎన్డీఏకు సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ స్నేహపూర్వక ప్రాంతీయ పార్టీల మద్దతుతో సౌకర్యవంతంగానే ఉంది. విపక్ష పార్టీ ఎంపీల రాజీనామాల కారణంగా రాజ్యసభలో మోదీ ప్రభుత్వం మెల్లమెల్లగా బలపడుతోంది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి సంఖ్యాబలం తక్కువగానే ఉన్నా ఎన్నడూ లేనంతగా సౌకర్యంగా ఉంది. మిత్రపక్ష ప్రాంతీయ పార్టీల మద్దతుతో సురక్షిత స్థానంలో ఉంది.
మోదీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో విపక్షాలు ఐక్యంగా ఉన్నాయి. రాజ్యసభలో ప్రభుత్వ ఎజెండాను అడ్డుకోగలిగాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం పరిస్థితి మారిపోయింది. పార్టీ మార్పిడి, రాజీనామాల సహకారంతో క్రమంలో రాజ్యసభలో బలాన్ని పెంచుకుంటోంది భాజపా.
కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ కేసీ రామమూర్తి రాజీనామాతో రాజ్యసభలో హస్తం బలం 45కు పడిపోయింది. ఇక రాష్ట్రంలో మెజారిటీ కారణంగా ఈ స్థానానికి ఉపఎన్నికలు జరిగితే బీజేపీ ఎగరేసుకుపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే రాజ్యసభలోని 245 సీట్లకు గాను బీజేపీ మెజారిటీ 83కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి బలం 106గా ఉంది. 5 ఖాళీలు ఉన్నాయి.
ఎన్డీఏలో భాగస్వామిగా లేకున్నా అన్నాడీఎంకే ప్రభుత్వానికే మద్దతుగా నిలుస్తుంది. ఈ పార్టీలో 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇలాగే బీజేడీ 7, టీఆరెస్ 6, వైసీపీ 2, మరో 3 ప్రాంతీయ పార్టీల సహకారం బీజేపీ కీలక బిల్లులకు ఊతమిస్తోంది.