రాజ్యసభలో పెరుగుతున్న ఎన్డీఏ బలం

శుక్రవారం, 18 అక్టోబరు 2019 (07:18 IST)
పెద్దలసభలో ఎన్​డీఏ బలం పెరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ సభ్యులు క్రమంగా రాజీనామాలు చేసి వెళ్లిపోతున్న తరుణంలో రాజ్యసభ మునుపటి కన్నా మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మారింది.

అధికార ఎన్డీఏకు సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ స్నేహపూర్వక ప్రాంతీయ పార్టీల మద్దతుతో సౌకర్యవంతంగానే ఉంది. విపక్ష పార్టీ ఎంపీల రాజీనామాల కారణంగా రాజ్యసభలో మోదీ ప్రభుత్వం మెల్లమెల్లగా బలపడుతోంది. ప్రస్తుతం ఎన్​డీఏ ప్రభుత్వానికి సంఖ్యాబలం తక్కువగానే ఉన్నా ఎన్నడూ లేనంతగా సౌకర్యంగా ఉంది. మిత్రపక్ష ప్రాంతీయ పార్టీల మద్దతుతో సురక్షిత స్థానంలో ఉంది.

మోదీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో విపక్షాలు ఐక్యంగా ఉన్నాయి. రాజ్యసభలో ప్రభుత్వ ఎజెండాను అడ్డుకోగలిగాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం పరిస్థితి మారిపోయింది. పార్టీ మార్పిడి, రాజీనామాల సహకారంతో క్రమంలో రాజ్యసభలో బలాన్ని పెంచుకుంటోంది భాజపా.

ఇదే దారిలో మొదటి పార్లమెంట్ సెషన్​లో పెద్దఎత్తున బిల్లులను ఆమోదించుకుంది ఎన్​డీఏ ప్రభుత్వం. ఎన్డీఏకు మద్దతుగా 106 మంది... పార్లమెంటు శీతకాల సమావేశాలకు రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్న వేళ మరో కాంగ్రెస్ ఎంపీ బుధవారం రాజీనామా చేశారు.

కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ కేసీ రామమూర్తి రాజీనామాతో రాజ్యసభలో హస్తం బలం 45కు పడిపోయింది. ఇక రాష్ట్రంలో మెజారిటీ కారణంగా ఈ స్థానానికి ఉపఎన్నికలు జరిగితే బీజేపీ ఎగరేసుకుపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే రాజ్యసభలోని 245 సీట్లకు గాను బీజేపీ మెజారిటీ 83కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి బలం 106గా ఉంది. 5 ఖాళీలు ఉన్నాయి.

ఎన్డీఏలో భాగస్వామిగా లేకున్నా అన్నాడీఎంకే ప్రభుత్వానికే మద్దతుగా నిలుస్తుంది. ఈ పార్టీలో 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇలాగే బీజేడీ 7, టీఆరెస్ 6, వైసీపీ 2, మరో 3 ప్రాంతీయ పార్టీల సహకారం బీజేపీ కీలక బిల్లులకు ఊతమిస్తోంది.

మరికొన్ని రోజుల్లో ఇతర పార్టీల నుంచి మరికొంత మంది ఎంపీలు బయటకు వెళతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో మెజారిటీ కారణంగా ఆ ఉపఎన్నికల్లో బీజేపీకు లాభం చేకూరే అవకాశం ఉంటుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల నాటికి మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు