కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. వారికే పటీదార్ల మద్దతు : హార్దిక్ పటేల్

బుధవారం, 22 నవంబరు 2017 (15:38 IST)
బీసీ జాబితాలో పటేదార్లను చేర్చడానికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చిందనీ అందువల్ల గుజరాత్ ఎన్నికల్లో పటీదార్ల మద్దతు వారికే ఉంటుందని పటీదార్ల ఉద్యమ యువనేత హార్దిక్ పటేల్ ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సెక్షన్‌ 31, సెక్షన్‌ 46 కింద పటీదార్లను బీసీల్లో చేర్చడానికి, పటీదార్లకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించినట్లు తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొన్ని వర్గాలకు అవసరానికిమించి రిజర్వేషన్లు ఇచ్చారని ఆరోపించిన ఆయన… ఓబీసీ కోటాపై సమగ్రమైన సర్వే నిర్వహిస్తామని కాంగ్రెస్ చెప్పిందన్నారు. ప్రస్తుతమున్న 49 శాతం పరిమితిలోనే తమకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. 
 
"సర్వే గనుక నిర్వహిస్తే… అన్ని విషయాలు ప్రజలకు స్పష్టంగా తెలుస్తాయి. రిజర్వేషన్లు ఎలా ఇస్తారో కాంగ్రెస్ తమ మేనెఫెస్టోలో వివరంగా చెప్పాలి.." అని హార్దిక్ పటేల్ అన్నారు. పటేల్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సీట్లు అక్కర్లేదనీ… తమకు రిజర్వేన్లు కల్పిస్తే చాలని ఆయన స్పష్టం చేశారు.
 
ఇకపోతే తాను ఏ పార్టీలో చేరడం లేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే, ఉత్తర గుజరాత్‌లో పటీదార్ ఆందోళనకు చెందిన కొందరిని కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ.50 లక్షలు ఆఫర్‌ చేసిందని ఆరోపించారు. ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి పనులకు దిగుతోందని ఎద్దేవా చేశారు. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా తాము పోరాడతామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు