ప్రజలను విభజించి పాలిస్తున్న ప్రధాని మోడీ : రాహుల్ ధ్వజం

ఠాగూర్

గురువారం, 26 సెప్టెంబరు 2024 (19:09 IST)
దేశ ప్రజలను విభజించి పాలిస్తున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం చండీగఢ్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసగించారు. ప్రధాని మోడీ ప్రజలను విభజించి పాలిస్తున్నారనీ, ఒకరిని చూసి మరొకరు అసహ్యించుకునేలా తయారు చేశారని మండిపడ్డారు. అలాగే, దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తుందన్నారు. 
 
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కుప్పకూలడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమన్నారు. 'కాంగ్రెస్‌ తుఫాను రాబోతోంది. అందులో బీజేపీ కొట్టుకుపోవడం పక్కా. రాష్ట్రాన్ని ఆ పార్టీ సర్వనాశనం చేసింది. అందుకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. ఇటీవల అమెరికా వెళ్లినప్పుడు అక్కడ ఉంటున్న హర్యానా వాసులను కలిశాను. డల్లాస్‌, టెక్సాస్‌లో ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది ఉన్నారు. 
 
ఇక్కడికెలా వచ్చారని అడిగితే.. హర్యానాలో కనీసం ఉపాధి దొరకడం లేదు. ఎలాగైన బతుకుసాగించాలన్న ఉద్దేశంతో ప్రమాదకర స్థితిలో కజకిస్థాన్‌, తుర్కియే, దక్షిణ అమెరికా దేశాలు దాటి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నామని చెప్పారు. కొందరు తమ వ్యవసాయ భూమిని విక్రయించి, ఆ డబ్బులతో అమెరికా వెళ్లినట్లు చెప్పారు. ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉంటే యువతకు ఇలాంటి గతి పట్టేదా? ప్రజల తలరాతలు మారాంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలి' అని రాహుల్ గాంధీ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు