హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమరం : వినేశ్ ఫొగాట్ వర్సెస్ బ బితా ఫొగాట్

ఠాగూర్

ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (15:15 IST)
హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న అభ్యర్థులు తమతమ ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదే క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి, జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్, ఆమె కజిన్ సిస్టర్, బీజేపీ నేత బబితా ఫొగాట్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. వినేశ్ ఫొగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఇప్పటికే బబిత ఫొగాట్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వినేశ్ ఫోగాట్ చేసిన సంచలన వ్యాఖ్యలపై బబిత ఘాటుగా స్పందించారు.
 
ఈసారి ఎన్నికల్లో హస్తం దెబ్బ గట్టిగా తగులుతుందని బీజేపీని ఉద్దేశించి వినేశ్ ఫోగాట్ అన్నారు. 'ఈసారి కాంగ్రెస్ చేతి చిహ్నం చెంప దెబ్బలా పని చేస్తుంది. అక్టోబరు 5వ తేదీన ఈ చెంపదెబ్బ ఢిల్లీలో కొట్టబడుతుంది' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు బబితా ఫోగాట్ ఘాటుగా స్పందించారు. సంకుచిత స్వభావం గలవారే ఇలాంటి కామెంట్స్ చేస్తారన్నారు. ఇలాంటి కామెంట్స్ చేసే ముందు వినేశ్ పునరాలోచించాలని కోరారు.
 
హర్యానాలో అక్టోబరు 5వ తేదీన పోలింగ్ జరగనుండగా, 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే .. బీజేపీలో బబితా ఫోగాట్ ఎంతో కాలం నుండి ఉన్నా ఆమెకు టికెట్ దక్కలేదు. కానీ వినేశ్ ఫోగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే టికెట్ లభించింది. వినేశ్ ఫోగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరికతో వారి కుటుంబంలో చీలిక వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు