వినేశ్ ఫొగాట్ చాంపియనే... ఆమె అన్ని సౌకర్యాలు కల్పిస్తాం : హర్యానా సీఎం

ఠాగూర్

గురువారం, 8 ఆగస్టు 2024 (13:06 IST)
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ చాంపియనేనని, అందువల్ల ఆమెకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీ వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్‌ నుంచి అధిక బరువు కారణంగా వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుకు గురైంది. దీంతో యూవత్ భారత్ షాక్‌కు గురైంది. పతకం ఖాయం అనుకున్న సమయంలో ఇలా అర్థాంతరంగా పోటీల నుంచి నిష్క్రమించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. 
 
ఈ క్రమంలో వినేశ్‌కు హర్యానా ప్రభుత్వం అండగా నిలిచింది. అంతేకాకుండా, ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినేశ్‌కు రజత పతక విజేతకు దక్కే అన్ని రకాల సౌకర్యాలు, సన్మానాలు, రివార్డులు అందజేస్తామన్నారు. ఈ హర్యానా రాష్ట్ర సీఎం సైనీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 
 
"అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరింది. ఏ కారణంతోనైనా ఆమె ఫైనల్ ఆడకపోవచ్చు. కానీ, మాకు ఆమె ఓ చాంపియన్. ఈ నేపథ్యంలో మా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్ మెడలిస్ట్ మాదిరిగానే ఆమెకు స్వాగతం పలకాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఒలింపిక్ రజత విజేతకు లభించే అన్ని రకాల సన్మానాలు, రివార్డులు, సౌకర్యాలను వినేశ్‌కు కల్పిస్తాం అని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు