నువ్వు ఈ పుడమి పుత్రికవు... వినేశ్ ఫొగాట్‌కు బజరంగ్ పునియా అండ

వరుణ్

బుధవారం, 7 ఆగస్టు 2024 (22:51 IST)
పారిస్ ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భారతదేశానికి బుధవారం చీకటి రోజుగా మిగిలిపోయింది. భారత రెజ్లర్ వినీశ్ ఫొగాట్‌పై అనర్హత వేటపడింది. దీనికి కారణం అధిక బరువు. కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే. దీంతో యావత్ భారత్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఈ నేపథ్యంలో వినేశ్ ఫొగాట్‌కు స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా అండగా నిలిచారు. ఆమె కోసం యావత్ ప్రపంచమంతా ప్రార్థిస్తుందంటూ పేర్కొన్నాడు. దీనిపై ఓ ట్వీట్ చేశారు
 
'నువ్వు ఈ పుడమి పుత్రికవు. చాలా ధైర్యంగా పోరాడావు. నిన్న నువ్వు గేమ్ ఆడేముందు ఒలింపిక్స్ అధికారులు నీ బరువు పరిశీలించినప్పుడు అంతా సరిగ్గానే ఉంది. ఇప్పుడు 100 గ్రాముల అధిక బరువు వచ్చిందంటున్నారు. దీన్ని నమ్మలేకపోతున్నా. నేనే కాదు.. ఈ రోజు ఉదయం జరిగినదాన్ని నమ్మాలని ఎవరూ కోరుకోవట్లేదు. యావత్ దేశం కన్నీటి పర్యంతమవుతోంది. అన్ని దేశాల మెడల్స్ ఒక ఎత్తయితే.. నీ మెడల్ ఒక ఎత్తు. 
 
ఇప్పుడు ప్రపంచమంతా నీకోసం ప్రార్థిస్తోంది. వారి ప్రార్థనలు సరైన చోటుకు చేరాలని కోరుకుంటున్నా. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మహిళా రెజ్లర్లంతా వినేశ్‌కు అండగా ఉంటారని ఆశిస్తున్నా' అని బజరంగ్ పునియా రాసుకొచ్చాడు. గతేడాది మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా వినేశ్తో కలిసి పునియా కూడా ఆందోళనల్లో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
 
అనర్హత వేటు తర్వాత ఆస్పత్రి పాలైన వినేశ్ ఫొగాట్... ఫోటో షేర్ చేసిన పీటీ ఉష 
 
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు జీవితంలో చీకటి రోజుగా బుధవారం మిగిలిపోయింది. ఒలింపిక్ క్రీడా పోటీల్లో భాగంగా, 50 కేజీల మహిళల ఫ్రీస్టైల్ విభాగం కేటగిరీలో ఆమె పోటీలో పాల్గొనకుండా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది. నిర్ణీత బరువు 50 కేజీల కంటే 100 గ్రాములు అధికంగా ఉన్న కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమెతో పాటు 140 కోట్ల భారతీయులు సైతం షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే వినేశ్ ఆస్పత్రి పాలయ్యారు. డీహైడ్రేషన్ కారమంగా ఆమె అనారోగ్యం బారినపడ్డారు. దాంతో వినేశ్‌ను ఒలిపింక్ గ్రామంలోని ఓ క్లినిక్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 
 
మంగళవారం బౌట్ సమయంలో కూడా ఆమె తన బరువును నియంత్రణలోనే ఉంచుకున్నారు. కానీ, మంగళవారం రాత్రికి వినేశ్ రెండు కిలోల బరువు ఒక్కసారిగా పెరిగిపోయారు. దీంతో జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటి బరువు తగ్గే వ్యాయామాలు చేశారు. చివరకు శరీరం నుంచి కొంత రక్తాన్ని కూడా వెలికి తీయడం, జుట్టు కత్తిరించడం వంటివి కూడా చేసినట్టు సమాచారం.  
 
అంతేకాకుండా భోజనం కూడా తీసుకోకుండా, బరువును తగ్గించుకునేందుకు రాత్రంతా ఆమె నిద్రపోకుండా మేల్కొనే ఉన్నట్టు సమాచారం, దీని కారణంగానే వినేశ్ ఇపుడు డీహైడ్రేషన్‌కు గురైనట్టు క్రీడాపండితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ఒలింపిక్ విలేజ్‌లోని ఓ పాలిక్లినిక్‌లో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె చికిత్స తీసుకుంటున్న ఫోటోను సైతం భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడం వల్ల అనర్హత వేటు పడింది. దయచేసి వినేశ్ ఫొగాట్ ప్రైవసీకి భంగం కలగకుండా నడుచుకోవాలని కోరుతున్నారు. ఇది అత్యంత బాధాకరం అని భారత ఒలింపిక్ సంఘం పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు