'హత్రాస్' నిందితులకు నిర్భయ దోషుల లాయర్ వకాల్తా!

మంగళవారం, 6 అక్టోబరు 2020 (08:44 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ హత్యాచార ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోని నిందితులను రక్షించేందుకు నిర్భయ దోషుల తరపున కోర్టులో వాదించిన న్యాయవాది అజయ్ ప్రకాష్ సింగ్ ఇపుడు వకాల్తా పుచ్చుకున్నారు. అదేసమయంలో హత్రాస్ బాధితురాలి తల్లిదండ్రుల తరపున వాదించేందుకు నిర్భయ కేసులో నిర్భయ తరపున వాదనలు వినిపించి, వారికి ఉరిశిక్ష పడేలా చేసి, దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సుప్రీంకోర్టు న్యాయవాది సీమా సమృద్ధి ఖుష్వహ ముందుకు వచ్చారు. 
 
దీంతో ఈ కేసు విచారణ ఎలా జరుగుతుందోనన్న ఆసక్తి ఇప్పటి నుంచే మొదలైంది. ఎందుకంటే, ఈ కేసులో నిందితులు యువతిపై దాడి చేశారే తప్ప, అత్యాచారం చేయలేదని వైద్య రిపోర్టులు రావడంతో కేసు ఏ మేరకు నిలిచి, కఠిన శిక్ష పడుతుందన్న విషయమై సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో ఓ 20 యేళ్ళ దళిత బాలికపై క్షత్రియ వర్గానికి చెందిన నలుగురు యువకులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుకను కత్తిరించారు. అయితే, ఈ కామాంధుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. 
 
ఈ క్రమంలో నిర్భయ హత్యాచార కేసులో, దోషులకు ఉరిశిక్ష తప్పించేందుకు అన్ని విధాలా ప్రయత్నించి విఫలమైన న్యాయవాది అజయ్ ప్రకాశ్ సింగ్... హత్రాస్ ఘటనలో దళిత బాలికపై అత్యాచారం చేసి, తీవ్రంగా దాడి చేసిన నిందితుల తరపున కూడా వకాల్తా పుచ్చుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురి తరపున వాదించేందుకు అజయ్ ప్రకాశ్ సింగ్‌ను అఖిల భారతీయ క్షత్రియ మహాసభ సంప్రదించగా, ఆయన సమ్మతించారు. 
 
ఈ నలుగురు యువకులు అమాయకులని, వారిని రక్షించేందుకు కేసును అంగీకరించిన ఏపీ సింగ్‌కు ధన్యవాదాలని ఈ సందర్భంగా క్షత్రియ మహాసభ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు, తమ వర్గంలోని కొందరిని ఈ కేసులో కావాలని ఇరికించారని, వారిని కాపాడేందుకు కట్టుబడివున్నామని, లాయర్ ఫీజులన్నీ మహాసభ స్వయంగా చెల్లిస్తుందని తెలిపారు.
 
మరోవైపు, నిర్భయ తరపున వాదనలు వినిపించి, వారికి ఉరిశిక్ష పడేలా చేసి, దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సుప్రీంకోర్టు న్యాయవాది సీమా సమృద్ధి ఖుష్వహ, హత్రాస్ బాధితురాలి తరపున వాదించేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఈ కేసు విచారణ ఎలా సాగుతుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు