మహారాష్ట్రలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ కామాంధుడు హెచ్ఐవీ సోకిన మైనర్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. దీనిపై బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురుని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లాకు చెందిన హెచ్ఐవీ బాధిత బాలిక లాథుర్ జిల్లాలోని బాలికల ఆశ్రమంలో ఉంటోంది. రెండేళ్లుగా ఆ బాలిక అక్కడే నివసిస్తోంది. అందులో పనిచేసే ఓ ఉద్యోగి రెండేళ్లలో ఆ బాలికపై నాలుగు సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఈ విషయంలో చిల్డ్రన్ షెల్టర్ హోమ్ నిర్వాహకులు సైతం ఆమెకు సహాయం చేయలేదు. అధికారులకు రాసిన ఉత్తరాలను సైతం వారు చింపేశారు.
ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో పరీక్షల్లో ఆమె నాలుగు నెలల గర్భవతిగా తేలింది. దీంతో అత్యాచారం చేసిన నిందితుడు డాక్టర్తో కుమ్మక్కై బాలికకు తెలియకుండానే అబార్షన్ చేయించాడు. అనంతరం బాలిక ధోకీ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.
అనంతరం ఈ కేసును ఆశ్రమం ఉన్న ఆసా స్టేషన్కు బదిలీ చేశారు. నలుగురిని అరెస్టు చేసినట్లు లాథుర్ జిల్లా ఎస్పీ అమోల్ తాంబే తెలిపారు. అరెస్టు అయిన వారిలో సేవాలే ఆశ్రమం ఫౌండర్ రవి బాపట్లే, సూపరింటెండెంట్ రచన బాపట్లే, ఉద్యోగులు అమిత్ మహముని, పూజ వాఘ్మరి ఉన్నట్టు ఆయన తెలిపారు.