తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి అన్నాడీఎంకే కలిసి పోటీ చేయనుంది. ఈ విషయాన్ని శుక్రవారం చెన్నై పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో అధికారికంగా ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సారథ్యంలో అన్నాడీఎంకే ఎన్నికలకు వెళుతుందని ఆయన స్పష్టంచేశారు. గత 1998లో నాటి ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలో బీజేపీ, అన్నాడీఎంకే కూటమిగా ఏర్పడి లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయాన్ని మంత్రి అమిత్ షా గుర్తుచేశారు.
ఈ పొత్తు కోసం అన్నాడీఎంకే ఎలాంటి షరతులు, డిమాండ్లు పెట్టలేదని అమిత్ షా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోదని స్పష్టంచేశారు. ఈ పొత్తు రెండు పార్టీలకు లాభదాయకమని చెప్పారు. సీట్ల కేటాయింపు వంటి అంశాలను త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని, ప్రజల దృష్టిని మరల్చేందుకు సనాత ధర్మ, త్రిభాషా విధానం వంటి అంశాలను తెరపైకి తెస్తుందని ఆరోపించారు. ఇదిలావుంటే బీజేపీతో దోస్తీ పెట్టుకున్నందుకుగాను అన్నాడీఎంకేకు ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని డీఎంకే నేతలు అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో అన్నాడీఎంకే ఖేల్ ఖతం కావడం ఖాయమని డీఎంకే నేతలు జోస్యం చెపుతున్నారు.