లాక్‌డౌన్ నుంచి మరికొన్ని మినహాయింపు... కేంద్రం ఉత్తర్వులు

శనివారం, 25 ఏప్రియల్ 2020 (09:19 IST)
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది వచ్చే నెల మూడో తేదీవరకు అమల్లోవుండనుంది. అయితే, ఈ నెల 20వ తేదీ నుంచి నాన్ హాట్ స్పాట్ కరోనా ప్రాంతాల్లో పాక్షికంగా లాక్‌డౌన్‌ను సడలించారు. తాజాగా మరికొన్నింటికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చారు. దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
 
ఈ ఉత్తర్వుల మేరకు.. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. మున్సిపాలిటీ పట్టణాలలో మాత్రం దుకాణాలు తెరిచేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే, పట్టణ ప్రాంతాలలో నిత్యావసరాలు కాకుండా ఇతర వస్తువులు అమ్మేందుకు జనావాస ప్రాంతాలలో ఉన్న దుకాణాలను తెరచేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. 
 
కానీ, ఈ దుకాణాలలో 50 శాతం సిబ్బంది మాత్రమే పనిచేయాలని.. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఈ అనుమతులు మద్యం దుకాణాలకు వర్తించబోదని తేల్చి చెప్పింది. అదేవిధంగా, 'హాట్ స్పాట్స్', కంటైన్మెంట్ జోన్స్‌కు కూడా ఈ ఉత్తర్వులు వర్తించవని క్లారిటీ ఇచ్చింది. అయితే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే.. తమ రాష్ట్రంలో ఎలాంటి మినహాయింపులు లేవని ప్రకటించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు