హనీ ట్రాప్‌లో చిక్కిన భారత జవాను... పుల్వామా దాడికి సూత్రధారి కి'లేడీ'

శనివారం, 18 మే 2019 (10:31 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామా జిల్లాలో భారత జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన దాడి వెనుక ఓ పాకిస్థాన్ మహిళ ఉన్నట్టు తేలింది. హనీ ట్రాప్ పేరుతో పాకిస్థాన్ అందగత్తెకు భారత జవాను ఒకరు సైనిక రహస్యాలను చేరవేయడం వల్లే ఈ దాడి జరిగినట్టు సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పుల్వామా దాడి ఘటనపై మధ్యప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి. ఈ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగుచూశాయి. 
 
పాకిస్థాన్ యువతి హనీ ట్రాప్‌లో చిక్కుకున్న భారత జవాను ఒకరు ఆమెకు సైనిక రహస్యాలను వెల్లడించినట్టు తేలింది. జవాను నుంచి సేకరించిన వివరాలను ఆమె ఉగ్రవాదులకు ఇవ్వడంతోనే పుల్వామా ఘటన జరిగినట్టు తెలుస్తోంది. 
 
మధ్యప్రదేశ్‌లోని మోహోలో ఉన్న బీహార్ రెజిమెంట్‌లో అవినాశ్ కుమార్ (25) నాయక్ క్లర్క్‌గా పనిచేసేవాడు. 2018లో అతడిని అసోంకు బదిలీ చేశారు. ఆ సమయంలో అతడికి ఓ పాకిస్థాన్ యువతితో వాట్సాప్ ద్వారా పరిచయమైంది. ఆమె వలలో చిక్కుకున్న అవినాశ్ ఆమె అడిగిందే తడవుగా ముందు వెనుక ఆలోచించకుండా సైనిక రహస్యాలను ఆమెకు చేరవేశాడు. 
 
అంతే.. అవన్నీ ఉగ్రవాదుల చేతికి చేరిపోయాయి. అలా పక్కా సమాచారాన్ని సేకరించిన ఉగ్రవాదులు పుల్వామా దాడికి పక్కా పథక రచన చేసి అమలు చేశారు. అవినాశ్ బ్యాంకు ఖాతాకు పాకిస్థాన్ నుంచి రూ.50 వేలు జమ అయినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అవినాశ్‌ అరెస్టు చేసిన పోలీసులు.. భోపాల్ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు