'దృశ్యం' మూవీ మర్డర్ సీన్ రిపీట్ - ప్రియుడు మోజులో భర్తను హత్య చేసి నడి ఇంటిలోనే పాతిపెట్టిన భార్య!

ఠాగూర్

మంగళవారం, 22 జులై 2025 (12:10 IST)
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ప్రియుడు మోజులోపడి కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి గదిలోని టైల్స్‌ కింద పాతిపెట్టింది. స్థానికంగా కలకలం రేపింది. మహారాష్ట్రంలో పాల్సర్ జిల్లా నలపోసర ప్రాంతంలోని సాయి వెల్ఫేర్ సొసైటీలో సినీ ఫక్కీలో ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 28 ఏళ్ల కోమల్ చవాన్ తన భర్త విజయ్ విజయ్ చవాన్ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అతని సోదరులు అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం విజయ్ ఇంటికి వచ్చి పరిశీలించగా, ఇంట్లోని కొన్ని టైల్స్ దెబ్బతిని, వాటి రంగు మిగతా వాటికి భిన్నంగా ఉండటం గమనించారు. దీంతో అనుమానం వచ్చి ఆ టైన్స్‌ను తొలగించగా, దుర్వాసనతో పాటు మృతదేహం బయటపడింది. 
 
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, అది విజయ్ చవాన్ మృతదేహమని పోలీసుల ప్రాథమిక విచారణలో కోమల్ చవాన్ నేరాన్ని దాచడానికి వినూత్న పద్ధతిని అనుసరించినట్లు తేలింది. బాత్రూమ్ మరమ్మతులు చేయాల్సి ఉందని, అందుకే టైల్స్ తొలగిస్తున్నట్లు పొరుగువారికి చెప్పి నమ్మబలికింది. కోమల్, విజయ్‌కు ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలంగా కోమల్, మోనుల మధ్య అఫైర్ నడుస్తోందని స్థానికులు వెల్లడించారు.
 
ఈ హత్యలో కోమల్‌తో పాటు ఆమె ప్రియుడు మోను కూడా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 'దృశ్యం' సినిమాలో మృతదేహాన్ని దాచిన తీరును అనుకరిస్తూ ఈ నేరం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కోమల్, మోనులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు