కొత్తవారికి అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యానికి కీలకం : ప్రధాని మోడీ

శనివారం, 30 డిశెంబరు 2023 (08:48 IST)
కొత్త వారికి అవకాశం ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యానికి కీలకం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఒకేసారి పలు తరాల నాయకత్వాన్ని ప్రోత్సహించే శక్తిసామర్థ్యాలు ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నాయన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ఇందులో అనేక అంశాలపై స్పందించారు. 
 
ముఖ్యంగా, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఘఢ్ రాష్ట్రాలను బీజేపీ కేవసం చేసుకోగా, ఈ రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులను ఎంపిక చేశారు. దీనిపై ఆయన స్పందించారు. 
 
ఇదేమి సరికొత్త ట్రెండ్ కాదన్నారు. గతంలో చాలా సార్లు బీజేపీలో ఇలా జరిగిందని, ఇందుకు మంచి ఉదాహరణ తానేనని చెప్పారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రాల్లో రాజకీయ ఉద్దండులను కాదని, కొత్తవారిని సీఎం పదవికి ఎంపిక చేయడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.
 
'బీజేపీలో ఎప్పటినుంచో ఉన్న ఈ ట్రెండ్‌కు తానే ఓ మంచి ఉదాహరణ. నేను గుజరాత్ సీఎం అయ్యేనాటికి నాకు పరిపాలన అనుభవం లేదు. అప్పటికి నేను అసెంబ్లీకి కూడా ఎన్నిక కాలేదు' అని మోడీ గుర్తు చేశారు. 2001లో కేశూభాయ్ పటేల్ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలను మోడీ స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాలుగు నెలలకు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
 
బీజేపీ కేడర్ ఆధారిత పార్టీ అని, వివిధ రకాల ప్రయోగాలు చేయడం పార్టీకి అలవాటేనని తెలిపారు. 'ఒకేసారి పలు తరాల నాయకత్వాన్ని ప్రోత్సహించే సామర్థ్యం బీజేపీకి ఉంది. పార్టీ అధ్యక్షులుగా ప్రతి కొన్నేళ్లకు కొత్త వారు వస్తుంటారు. కొత్త తరానికి అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకం' అని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు