ఢిల్లీ పర్యటనలో సీఎం స్టాలిన్-నీట్ పరీక్ష తమిళనాడుకు వద్దు.. కేజ్రీవాల్‌తో కలిసి..?

శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (14:18 IST)
MK Stallin
తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్టాలిన్ తనదైన స్టైల్‌లో ముందుకు పోతున్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల ఆదరణ పొందుతున్నారు. 
 
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలిశారు. ఆయనతో పాటు దేశ రాజధానిలో స్కూల్స్, మొహల్లా క్లీనిక్స్‌ను సందర్శించారు. క్లీనిక్స్‌లో పనిచేస్తున్న డాక్టర్లతో కూడా ఆయన మాట్లాడి పలు అంశాలను తెలుసుకున్నారు. 
 
ఈ పర్యటనలో స్టాలిన్ వెంట కేజ్రీవాల్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమిళనాడు ప్రభుత్వం విద్య, ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించిందని స్టాలిన్ తెలిపారు. తమిళనాడులో ఆధునిక పాఠశాలల ఏర్పాటు కోసం పనులు జరుగుతున్నాయన్నారు.
 
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటారని ఆశిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజల తరపున కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తున్నామని ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. 
 
దేశ రాజధానిలో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల పట్ల స్టాలిన్ ఆకర్షితులయ్యారు. అందుకే ఆయన ఢిల్లీలో పాఠశాలలను సందర్శించారు. దీంతో పాటు ఆప్ ప్రభుత్వ మొహల్లా క్లినిక్‌లను కూడా స్టాలిన్ సందర్శించారు.
 
మరోవైపు నాలుగు రోజుల పాటు.. ఢిల్లీ పర్యటనలో ఉండనున్నారు సీఎం స్టాలిన్. బుధవారం రాత్రి ఢిల్లీ వెళ్ళిన సీఎం ఎంకే స్టాలిన్‌ గురువారం ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నీట్ పరీక్షల నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరారు. 
 
డీఎంకే ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష, పార్లమెంట్‌ భవనంలోని మహిళా ఎంపీలతో భేటీ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా స్టాలిన్‌ను కలిశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు