ఎన్డీయే కూటమిని ప్రజలు తిరస్కరించారు.. మోడీ ప్రధాని పదవి వద్దనాలి!!

వరుణ్

శుక్రవారం, 7 జూన్ 2024 (11:54 IST)
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని దేశ ప్రజలు తిరస్కరించారని, అందువల్ల ప్రధానమంత్రి పదవి తనకు వద్దని నరేంద్ర మోడీ చెప్పాలని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. తాజాగా వెల్లడైన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఆయన కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించరాదని పిలుపునిచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, 'ఈ ఫలితాల విషయంలో బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సుమారు 200 సీట్లు వచ్చాయి. అప్పుడు రాజీవ్ గాంధీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరగా.. ప్రజల తీర్పు తనకు అనుకూలంగా రాలేదని తిరస్కరించారు. దాంతో అప్పుడు తర్వాత స్థానంలోఉన్న పెద్ద పార్టీకి పిలుపువచ్చిందిట అని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు బీజేపీ, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్నాయని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
 
1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 197 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ మాత్రం రాలేదు. జనతాదళ్‌ 143 స్థానాలు దక్కించుకుంది. అప్పుడు వీపీసింగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ ఎన్నికల విషయానికి వస్తే.. 293 సీట్లతో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీని దక్కించుకుంది. ఈ కూటమి ప్రధాన పార్టీ భాజపాకు 240 సీట్లు వచ్చాయి. గత రెండుసార్లు కమలం పార్టీ సొంతంగా మ్యాజిక్‌ ఫిగర్‌(272) దాటగా.. ఈసారి మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. దీని తర్వాత స్థానంలో కాంగ్రెస్‌(99) ఉన్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు