77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు- ప్రధాని ప్రసంగం హైలైట్స్

మంగళవారం, 15 ఆగస్టు 2023 (08:58 IST)
Modi
77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా  ప్రధాని వరుసగా పదవ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇది ప్రధానికి చివరి ప్రసంగం.  
 
ఈ సందర్భంగా 2014 నుంచి ప్రధాని తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రభుత్వ విధానాల గురించి తెలిపారు. ప్రతిపక్షాలను నేరుగా విమర్శించలేదు. తాము అధికారంలోకి వచ్చాక అవినీతి, విధానపరమైన స్తబ్దత తొలగిపోయాయని చెప్పేవారు. యావత్ దేశం మణిపూర్ ప్రజలకు అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. మణిపూర్‌లో శాంతిస్థాపనకు కృష్టిచేస్తున్నామని తెలిపారు.
 
2014నాటి తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో స్వచ్ఛ భారత్, జన్ ధన్ అకౌంట్ల వంటి పథకాలను ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. భారత్‌ను 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు తన పంచ ప్రాణ ప్రణాళికను మోదీ గతేడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో దేశ ప్రజల ముందుంచారు.
 
తొలుత ప్రధాని రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం, ఎర్రకోటకు చేరుకున్నారు. త్రివిధ దళాలు గౌరవవందనం స్వీకరించిన అనంతరం ప్రధాని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
 
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదేన్న ప్రధాని, దేశస్వాతంత్ర్యం ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా వర్ణించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలమని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత పదేళ్లల్లో తమ ప్రభుత్వం ఎన్నో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చిందనీ, దేశం ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని ప్రధాని పేర్కొన్నారు. 
 
కరోనా సంక్షోభాన్ని కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. 30 ఏళ్ల లోపు యువత ప్రస్తుతం భారత్‌కు ఆశాకిరణమని వర్ణించారు. నారీ శక్తి, యువశక్తి దేశానికి ఎంతో కీలకమని చెప్పారు. టెక్నాలజీలో ఎంతో మెరుగైన భారత్, డిజిటల్ ఇండియా కల సాకారం దిశగా దూసుకుపోతోందన్నారు. వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, స్టార్టప్స్, అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ పురోగతిని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు