మహారాష్ట్ర వేరియంట్.. శ్వాస సమస్యలొస్తే జాగ్రత్త...

శుక్రవారం, 14 మే 2021 (18:53 IST)
మహారాష్ట్ర వేరియంట్‌తో దేశం వణికిపోతోంది. డబుల్‌ మ్యుటేషన్‌గా పేరొందిన ఈ వేరియంట్‌ అత్యంత వేగంగా దూసుకువెళ్తోంది. ఈ రకం వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తుంది. నేరుగా ఊపిరితిత్తులపైనే దాడి చేస్తోంది. దీని బారినపడిన వారికి ఎక్కువగా శ్వాస సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే దేశంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో ప్రతి మూడింట్లో ఒకటి మహారాష్ట్ర వేరియంట్‌ ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది.
 
వివిధ దేశాల్లో వైరస్‌ వ్యాప్తి, తీవ్రతపై డబ్ల్యూహెచ్‌వో ఓ నివేదిక విడుదల చేసింది. జన్యు విశ్లేషణ ఆధారంగా వైరస్‌ వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ఏప్రిల్‌ నుంచి మే 11 వరకు దాదాపు 44 దేశాల్లో 4,500 నమూనాలు పరిశీలించి నివేదిక విడుదల చేసింది. 
 
ఈ నివేదికలో మహారాష్ట్ర వేరియంట్‌ను కూడా ప్రస్తావించారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా పది రకాల వేరియంట్లు ప్రమాదకరంగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ పదింట్లో యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకం వైరస్‌లు అత్యంత ప్రభావవంతమైనవని తేల్చింది. ఇప్పుడు మహారాష్ట్ర వేరియంట్‌ కూడా వాటి సరసన చేరింది.
 
మహారాష్ట్ర వేరియంట్‌ను అక్టోబర్‌లోనే గుర్తించారు. కానీ ఫిబ్రవరి నెలాఖరు నుంచి వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో మొత్తంగా మహారాష్ట్ర వేరియంట్‌ 33 శాతం ఉంది. ఈ వేరియంట్‌ సోకిన వారిలో ఆరోగ్యక్షీణత వేగంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర వేరియంట్‌ ప్రమాదకారి అయినప్పటికీ వ్యాక్సిన్‌తో ఎదుర్కోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు