వందేభారత్ తొలి స్లీపర్ రైలు సిద్ధం... ప్రత్యేకత ఏంటి?

ఠాగూర్

మంగళవారం, 5 ఆగస్టు 2025 (18:34 IST)
దేశంలోని రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. దేశంలో వందే భారత్ తొలి స్లీపర్ రైలు సేవలు వచ్చే సెప్టెంబరులో అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ తొలి స్లీపర్ రైలు సేవలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించనున్నారు. 
 
వందే భారత్ స్లీపర్ ఒక కొత్త రకం సెమీ-హై-స్పీడ్ రైలు. భారత రైల్వేలో రాత్రిపూట ప్రయాణాలకు సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించారు. ప్రస్తుతం దేశంలో 50 కంటే ఎక్కువ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి, కానీ అవి కేవలం చైర్ కార్ సౌకర్యంతో శతాబ్ది రూట్లలో నడుస్తున్నాయి.
 
ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు రాజధాని రూట్లలో నడిచేలా రూపొందించారు. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టయర్, ఏసీ 3టయర్ సహా 16 కోట్లతో 1,128 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ రైళ్లు న్యూ ఢిల్లీ - హౌరా, న్యూ ఢిల్లీ - ముంబై, న్యూ ఢిల్లీ - పూణే, న్యూ ఢిల్లీ - సికిందరాబాద్ మధ్య నడిచే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
 
భావ్నగర్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం డిజిటల్‌గా మూడు కొత్త రైళ్లను ప్రారంభించారు. వీటిలో అయోధ్య ఎక్స‌ప్రెస్, రేవా-పూణే ఎక్స్‌ప్రెస్, జబల్పూర్ రాయ్పూర్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. అలాగే, ఎనిమిది అమృత్ భారత్ రైళ్లను కొత్తగా ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు.
 
భారత రైల్వేల పునర్మిర్మాణంపై అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో భారత రైల్వేలు పెద్ద ఎత్తున ఆధునికీకరణ పొందుతున్నాయని తెలిపారు. భారత రైల్వే చరిత్రలో మొదటిసారిగా రోజుకు 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం రైల్వే ట్రాక్‌లను వేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు 34,000 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లను వేసినట్టు తెలిపారు. 1,300 స్టేషన్లను పునర్నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, ముంబై-అహ్మదాబాద్ మధ్య దేశంలోని మొదటి బుల్లెట్ రైలు సేవలు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఇది 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల 7 నిమిషాల్లో చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు