నవంబరు 6న అంతరిక్షంలోకి పీఎస్ఎల్వీ-సీ49 రాకెట్

గురువారం, 29 అక్టోబరు 2020 (10:40 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. నవంబరు ఆరో తేదీన పీఎస్ఎల్వీ-సీ49 రాకెట్‌ను అంతరిక్ష కక్ష్యలోకి పంపించనుంది. ఈ పీఎస్ఎల్వీ సీ49 రాకెట్... భూ పరిశీలన నిఘా ఉపగ్రహం రిశాట్-2 బీఆర్2తో పాటు మరో పది విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. అయితే, చివరిక్షణంలో ఏదేని సమస్య ఉత్పన్నమైతే మాత్రం ఈ ప్రయోగాన్ని 7 లేదా 8 తేదీల్లో నిర్వహించాలని ఇస్రో భావిస్తోంది. 
 
కాగా, కొవిడ్-19 మహమ్మారి అనంతరం ఇస్రో ఈ యేడాది చేపడుతున్న తొలి ఉపగ్రహ ప్రయోగం ఇదే కావడం గమనార్హం. మార్చి నుంచి అన్ని అంతరిక్ష కార్యకలాపాలు నిలిచిన ఇస్రో మరోసారి పరిశోధనలను ముమ్మరం చేసింది. డిసెంబర్ నాటికి కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ) పరీక్షించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.
 
అయితే, రిశాట్-2 బీఆర్2 శాటిలైట్‌ భూమి పరిశీలనకు ఉపయోగపడనుంది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ వ్యవస్థ ద్వారా ఏ వాతావరణ పరిస్థితుల్లోనా భూమిని నిశితంగా పరీక్షించవచ్చు. చైనాతో ఎల్‌ఏసీ వెంట నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తల మధ్య డ్రాగన్‌ ఎత్తుగడలను తెలుసుకునేందుకు ఈ శాటిలైట్  ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
అలాగే, నిఘాతో పాటు వ్యవసాయం, అటవీ, నేల తేమ, భూగర్భశాస్త్రం, తీర పర్యవేక్షణ, వరదలను పరిశీలించేందుకు ఈ ఉపగ్రహం ద్వారా పర్యవేక్షించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మిషన్‌ పూర్తయిన వెంటనే డిసెంబరులో జీశాట్‌-12 ఆర్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలో పెట్టేందుకు పీఎస్‌ఎల్‌వీ-సీ 50 మిషన్‌ను చేపట్టాలని ఇస్రో భావిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు