జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి నేడు.. ఆగస్టు 15న ప్రధాని అయ్యారు.. 17 సంవత్సరాల పాటు..?

గురువారం, 27 మే 2021 (11:06 IST)
Nehru
దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి నేడు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా సుధీర్ఘ కాలంపాటు పనిచేసిన నెహ్రూ.. నవంబర్ 14, 1889న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదులో మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జన్మించారు.

ఈయనది కశ్మీరి బ్రాహ్మణ కుటుంబం. అలహాబాద్‌లో విద్యను అభ్యసించి లా చదవడానికి ఇంగ్లండ్ వెళ్లారు. స్వదేశానికి తిరిగివచ్చిన తరవాత జాతీయోద్యమంలో ప్రవేశించి మహాత్మాగాంధీకి సన్నిహితులయ్యారు.
 
భారతదేశ జాతీయోద్యమ పోరాటంలో పాల్గొని నెహ్రూ పలుమార్లు జైలుశిక్ష అనుభవించారు. ఈయన తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా జాతీయోద్యమ నాయకుడు. జైలులో ఉన్నప్పుడే ‘గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ’, ‘ది డిస్కవరీ అఫ్ ఇండియా’ గ్రంథాలను నెహ్రూ రచించారు.

1929లో భారత జాతీయ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. 1936, 1937 చివరిగా 1946లో కూడా కాంగ్రెస్‌కు అధ్యక్షుడయ్యారు. జాతీయోద్యమంలో గాంధీజీ తర్వాత రెండో ప్రముఖ నాయకుడిగా అవతరించారు.
 
స్వాతంత్య్రం వచ్చినప్పుడు 1946లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి నెహ్రూ ప్రధానమంత్రిగా వ్యవహరించారు. స్వాతంత్ర్యానంతరం పూర్తిస్థాయి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించి తొలి ప్రధానమంత్రిగా కీర్తి పొందారు. నెహ్రూ 1947 ఆగస్టు 15న ప్రధానమంత్రి అయ్యారు.

దేశ స్వాతంత్ర్య పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. 1952, 1957, 1962లలో కూడా కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించి మొత్తం 17 సంవత్సరాలు ప్రధానమంత్రి పదవిని నిర్వహించారు. భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మే 27, 1964న మరణించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు