బీజేపీ చీఫ్‌గా జేపీ నడ్డా.. హోం మంత్రిగా అమిత్ షా?

బుధవారం, 29 మే 2019 (16:27 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా జేపీ నడ్డా నియమితులు కానున్నారు. అలాగే, ప్రస్తుతం చీఫ్‌గా ఉన్న అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా నియమితులు కానున్నారు. 
 
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ సింగిల్‌గానే ఏకంగా 303 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 353 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద కూటమిగా అవతరించింది.
 
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం కూర్పుపై ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ చీఫ్ అమిత్ షాలు ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు. వీరిద్దరి చర్చల తర్వాత జాతీయ మీడియా ఊహాగాన కథనాలను ప్రచురించాయి. 
 
ఈ కథనాల మేరకు కేంద్ర హోం మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్‌ను కేంద్ర రక్షణ మంత్రిగా, రక్షణ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌ను కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రిగానూ, కేంద్ర హోం మంత్రిగా అమిత్ షాలు నియమితులు కానున్నట్టు సమాచారం. 
 
మరోవైపు, అమిత్ షా... కేంద్ర హోం మంత్రిగా నియమితులైన తర్వాత బీజేపీ చీఫ్‌గా కేంద్ర ఆరోగ్య మంత్రిగా జేపీ నడ్డా నియమితులు కానున్నారు. 59 యేళ్ళ నడ్డా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. 
 
అయితే, ఆయన ఎక్కువ ప్రచారంలో లేకపోయినప్పటికీ మంచి వ్యూహకర్తగా పేరుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల బాధ్యతలను కూడా ఆయన చూసుకున్నారు. ఈయన సారథ్యంలో యూపీలోని మొత్తం 80 సీట్లకు గాను బీజేపీ 62 చోట్ల విజయం సాధించింది. పైగా, అమిత్ షా - జేపీ నడ్డాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు