పదేళ్ళలో చేయలేనిది వంద రోజుల్లో చేసి చూపిస్తా : కమల్ హాసన్

సోమవారం, 29 మార్చి 2021 (11:46 IST)
సినీ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. మక్కల్ నీది మయ్యం అనే పేరుతో పార్టీని స్థాపించారు. రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేస్తోంది. ఇందుకోసం కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుని తృతీయ కూటమిగా అవతరించింది. అలాగే, కమల్ హాసన్ కూడా కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 
 
తన ఎన్నికల ప్రచారంలోభాగంగా ఆదివారమంతా ఆయన తన నియోజకవర్గ ప్రజలతో గడిపారు. ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనకు కనుక అధికారమిస్తే గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనిని తాను వంద రోజుల్లో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. 
 
చిన్నచిన్న వీధుల్లోకి సైతం వెళ్లి ప్రచారం చేశారు. ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడారు. తనకు కనుక అధికారమిచ్చి అండగా నిలిస్తే పాలకులు ఈ పదేళ్లలో చేయలేని పనిని కేవలం వంద రోజుల్లో చేసి చూపిస్తానని, రాష్ట్రం రూపురేఖల్ని సమూలంగా మార్చివేస్తానని అన్నారు. కోయంబత్తూరును దేశంలోనే ఆదర్శనగరంగా మారుస్తానని హామీ ఇచ్చారు.
 
కోయంబత్తూరు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి రానక్కర్లేదన్నారు. ఒక ఎమ్మెల్యేగా కూడా అభివృద్ధి చేయవచ్చన్నారు. అందుకే, కోవై నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అభివృద్ధిలో కోవైను దేశానికే కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తానని తెలిపారు. నియోజవర్గంలో ప్రజా సమస్యల కోసం ప్రతి వార్డులోనూ ఎంఎన్ఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని, అక్కడ 24 గంటలపాటు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
 
మరోవైపు, కమల్‌కు మద్దతుగా ప్రముఖ సినీనటి, కమల్ సోదరుడు చారుహాసన్ కుమార్తె సుహాసిని నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఎక్కడికక్కడ ఓటర్లతో మాట్లాడుతూ, ఓపిగ్గా సమస్యలు వింటూ ప్రచారం నిర్వహించారు. కమల్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు