సిద్ధరామయ్యపై ఎఫ్ఐఆర్.. కర్నాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?

ఠాగూర్

శనివారం, 28 సెప్టెంబరు 2024 (10:25 IST)
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ట్రస్టు పేరిట భూకుంభకోణానికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏ1గా సిద్ధరామయ్య, ఏ2గా ఆయన భార్య పార్వతి, ఏ3గా బావమరిది పేర్లను ఎఫ్ఐఆర్‌లో లోకాయుక్త పోలీసులు చేశారు. బుధవారం బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. 
 
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబానికి మంగళూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్‌ విచారణకు ఆదేశించడాన్ని ఇటీవల హైకోర్టు సమర్థించింది. ఆ తర్వాత ప్రత్యేక కోర్టు సీఆర్​పీసీ సెక్షన్ 156(సీ) కింద విచారణ చేపట్టాలని, డిసెంబర్ 24లోపు దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఈ ఎఫ్​ఐఆర్​లో సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, ఆయన బంధువులు మల్లికార్జున స్వామి, దేవరాజు(ఈయన దగ్గరి నుంచి భూమి కొని మల్లికార్జున్ పార్వతికి ఇచ్చారు) తదితరుల పేర్లను చేర్చారు.  దీంతో ఆయన రాజీనామా చేస్తే కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇపుడే సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతుంది.
 
కాగా, ఈ విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. పార్టీ సిద్ధరామయ్యకు మద్దతుగా నిలుస్తుందన్నారు. ఇక సీఎం రాజీనామా చేయాలంటూ చేస్తున్న డిమాండ్లపై మాట్లాడిన ఖర్గే, ఈ కేసులో ఛార్జ్​షీటు కానీ దోషిగా తేలడం గానీ జరగలేదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తామన్నారు. గోద్రా అల్లర్లు జరిగినప్పుడు అప్పటి గుజరాత్​ సీఎం నరేంద్ర మోడీ రాజీనామా చేశారా అని ఎదురుదాడికి దిగారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షాపై కూడా పలు కేసులు పెండింగ్​లో ఉన్నాయని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా కొనసాగడం సిద్ధరామయ్య నైతిక హక్కు అని అన్నారు.
 
మరోవైపు, సీబీఐకి ఇచ్చిన సాధారణ అనుమతిని వెనక్కి తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయాన్ని కూడా మల్లికార్జున ఖర్గే సమర్థించారు. ఆ నిర్ణయాధికారం తమ పరిధిలోనే ఉందన్నారు. దీంతోపాటు, సీబీఐ పలు కేసుల్లో పక్షపాత వైఖరిని అవలంభిస్తోందని ఆరోపించారు. "ఇలా అనుమతి వెనక్కి తీసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. దేవరాజు సీఎంగా ఉన్నప్పుడు, సీబీఐని దుర్వినియోగం చేసినప్పుడు కూడా ఇలాగే అనుమతిని వెనక్కి తీసుకున్నారు. అందుకే ఇది సాధారణ విషయం. నేను సీఎంగా ఉన్నప్పుడు, వందల మంది మరణానికి కారణమైన వీరప్పన్ కేసు, స్టాంప్​ పేపర్ వెండర్ తెల్గితో పాటు మరో కేసు సీబీఐకి రిఫర్​ చేశాను. ఈ కేసుల్లో దర్యాప్తులు సవ్యంగానే కొనసాగున్నాయని, తాము ఆ కేసులు తీసుకోమని సీబీఐ చెప్పింది" అని ఖర్గే అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు